ఈపీఎఫ్‌వోలో కొత్తగా 15 లక్షల సభ్యులు

21 Sep, 2021 12:53 IST|Sakshi

న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో)లో కొత్త సభ్యుల నమోదు జూన్‌తో పోలిస్తే జులైలో నికరంగా 31.28 శాతం పెరిగింది. జూన్‌లో ఈ సంఖ్య 11.16 లక్షలుగా ఉండగా జులైలో 14.65 లక్షలుగా నమోదైంది.

వీరిలో 9.02 లక్షల మంది తొలిసారిగా చేరిన వారు. ఇక మిగతా వారు గతంలో ఈపీఎఫ్‌వో నుంచి వైదొలిగి..మళ్లీ కొత్త ఉద్యోగంలో చేరడం ద్వారా తిరిగి సభ్యత్వం పొందారు. దేశీయంగా సంఘటిత రంగంలో ఉద్యోగాల కల్పన మెరుగుపడటాన్ని ఇది ప్రతిబింబిస్తోందని కార్మిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ఈపీఎఫ్‌వో సోమవారం విడుదల చేసిన డేటా ప్రకారం.. గత నాలుగు నెలలుగా చందాదారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఏప్రిల్‌లో కొత్త సభ్యుల నమోదు నికరంగా 8.9 లక్షలుగా ఉండగా, మే నెలలో 6.57 లక్షలుగా నమోదైంది. ఏప్రిల్‌ మధ్య నుంచి కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ వ్యాప్తితో పలు రాష్ట్రాల్లో కొత్తగా లాక్‌డౌన్‌ విధించాల్సి రావడం కాస్త ప్రతికూల ప్రభావం చూపింది.  

మరిన్ని వార్తలు