ఫ్యూచర్‌, రిలయన్స్‌ డీల్‌: మరో కీలక పరిణామం

15 Apr, 2021 08:46 IST|Sakshi

ఫ్యూచర్‌ రిటైల్,  రియలన్స్‌ డీల్‌ వివాదం

 సుప్రీంకోర్టును ఆశ్రయించిన అమెజాన్‌

సాక్షి, న్యూఢిల్లీ: ఫ్యూచర్‌ రిటైల్‌తో వివాదం విషయంలో అమెజాన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. స్టాక్‌ ఎక్స్చేంజీలకు సమర్పించిన ఫైలింగ్‌లో ఫ్యూచర్‌ రిటైల్‌ ఈ విషయాన్ని తెలిపింది. కేసు వివరాల్లోకి వెళితే... ఫ్యూచర్‌ గ్రూప్‌లో భాగమైన ఫ్యూచర్‌ కూపన్స్‌ (ఎఫ్‌సీపీఎల్‌)లో అమెజాన్‌ కొంత వాటా కొనుగోలు చేసింది. ఎఫ్‌సీపీఎల్‌కు ఫ్యూచర్‌ రిటైల్‌లో వాటాలు ఉన్నందున.. అమెజాన్‌ కూడా పరోక్షంగా అందులోను (ఫ్యూచర్‌ రిటైల్‌) స్వల్ప వాటాదారుగా మారింది. ఇక కరోనా వైరస్‌ పరిణామాలతో నిధులపరంగా తీవ్ర సంక్షోభం ఎదురవడంతో ఫ్యూచర్‌ రిటైల్‌ వ్యాపారాన్ని దాదాపు రూ. 24,713 కోట్లకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కి (ఆర్‌ఐఎల్‌) విక్రయించేందుకు ఫ్యూచర్‌ గ్రూప్‌ ఒప్పందం కుదుర్చుకుంది. డీల్‌కు అనుమతుల కోసం ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించింది. అయితే, ఈ డీల్‌.. తమతో కుదుర్చుకున్న ఒప్పంద నిబంధనలకు విరుద్ధమంటూ అమెజాన్‌ సింగపూర్‌ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా.. దానికి అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. వీటి అమలు కోసం అమెజాన్‌ .. ఢిల్లీ హైకోర్టు తలుపు తట్టింది, యథాతథ స్థితి కొనసాగించాలంటూ సింగిల్‌ జడ్జి ఆదేశాలు ఇచ్చారు. వీటిని సవాలు చేస్తూ ఎఫ్‌ఆర్‌ఎల్‌.. ఢిల్లీ హైకోర్టు డివిజనల్‌ బెంచ్‌ని ఆశ్రయించింది. అమెజాన్‌తో ఎఫ్‌సీపీఎల్‌ ఒప్పంద నిబంధనలు, ఆర్‌ఐఎల్‌-ఎఫ్‌ఆర్‌ఎల్‌ ఒప్పంద నిబంధనలు వేరువేరని, డీల్‌ విషయంలో ముందుకెళ్లొచ్చంటూ సింగిల్‌ జడ్జి ఆదేశాలపై స్టే విధిస్తూ డివిజనల్‌ బెంచ్‌ ఉత్తర్వులు ఇచ్చింది. వీటిపైనే అమెజాన్‌.. సుప్రీం కోర్టును ఆశ్రయించింది. 
సింగిల్‌ బెంచ్‌ తుది తీర్పుతో ఉత్కంఠ 
డీల్‌ విషయంలో ముందుకు వెళ్లాలా వద్దా అన్న అంశంపై (అమెజాన్‌ వేసిన అప్పీల్‌) విచారణ సుప్రీంకోర్టు పరిధిలో ఉండగానే లోపునే ఢిల్లీ హైకోర్టు సింగిల్‌ జడ్జి బెంచ్‌ ఫ్యూచర్‌ గ్రూప్‌ను కట్టడిచేస్తూ, 2021 మార్చి 18న కేసులో తుది తీర్పును ఇచ్చింది. గ్రూప్‌ కంపెనీల్లో వాటాల విక్రయానికి సంబంధించి అమెజాన్‌ విబేధాలకు సంబంధించి సింగపూర్‌ ఎమర్జన్సీ ఆర్బిట్రేషన్‌ (ఈఏ) 2020 అక్టోబర్‌ 25న ఇచ్చిన ఉత్తర్వులను ఫ్యూచర్‌ గ్రూప్‌ కావాలనే నిర్లక్ష్యం చేసినట్లు స్పష్టమవుతోందని 134 పేజీల తీర్పులో ఏకసభ్య ధర్మాసనం పేర్కొంది. ఫ్యూచర్‌ గ్రూప్‌ ఈ కేసుకు సంబంధించి లేవనెత్తిన అభ్యంతరాలన్నింటినీ తోసిపుచ్చుతూ ఫ్చూచ్‌ గ్రూప్‌ ఆ సంస్థ డైరెక్టర్లపై రూ. 20 లక్షల ‘కాస్ట్‌’ను విధించింది. ఢిల్లీ కేటగిరీలో సీనియర్‌ సిటిజన్లు, పేదలకు వ్యాక్సినేషన్‌ వినియోగించే విధంగా రెండు వారాల్లో రూ. 20 లక్షల కాస్ట్‌ మొత్తాన్ని ప్రధానమంత్రి సహాయక నిధిలో డిపాజిట్‌ చేయాలని ఆదేశించింది. ఏప్రిల్‌ 28వ తేదీన ఈ కేసు విషయంలో స్వయంగా హాజరుకావలని ప్రమోటర్‌ బియానీ, ఇతర డైరెక్టర్లను ఆదేశించింది. వారి ఆస్తుల జప్తునకూ ఆదేశాలు జారీచేసింది. వారి ఆస్తుల వివరాలను నెల రోజుల్లో అఫిడవిట్‌ రూపంలో ఇవ్వాలని స్పష్టం చేసింది. సింగపూర్‌ ట్రిబ్యునల్‌ ఉత్తర్వులను పట్టించుకోనందుకు మూడు నెలలు తక్కువకాకుండా జైలు శిక్ష ఎందుకు విధించరాదని ప్రశ్నిస్తూ, సమాధానానికి రెండు వారాల గడువిచ్చింది. కేసు తదుపరి విచారణను ఏప్రిల్‌ 28వ తేదీకి వాయిదా వేసింది. ఈ సింగిల్‌ జడ్జి తీర్పుపై ఢిల్లీ హైకోర్టు డివిజనల్‌ బెంచ్‌ తదుపరి విచారణ వరకూ స్టే ఇచ్చింది. తాజాగా ఈ స్టేపై అమెజాన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

మరిన్ని వార్తలు