మదుపర్లను ఆకర్షించని గోల్డ్‌ ఈటీఎఫ్‌లు

21 Oct, 2023 20:04 IST|Sakshi

ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్న సమయంలో మదుపర్లు బంగారంపై మొగ్గుచూపుతుంటారు. దాంతో గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లో మదుపు చేస్తుంటారు. ఆగస్టు నెలలో ఈ ఈటీఎఫ్‌ల్లో గరిష్ఠంగా పెట్టుబడులు పెట్టారు. అయితే గత కొన్నిరోజులుగా బంగారం ధర పెరుగుతుంది. దాంతో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా గత నెలలో పసిడి ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్లలోకి నికరంగా రూ.175 కోట్ల మేరకే  పెట్టుబడులు వచ్చాయని భారతీయ మ్యూచువల్‌ ఫండ్ల సంఘం (ఏంఎఆఫ్‌ఐ) వెల్లడించింది. ఆగస్టులో ఈ పెట్టుబడులు 17 నెలల గరిష్ఠమైన రూ.1028 కోట్లకు చేరాయి. జులైలో ఈ మొత్తం రూ.456 కోట్లుగా ఉంది.

అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగే వీలుండటం, ద్రవ్యోల్బణం అధికంగానే కొనసాగడం, వృద్ధి రేటు మందగించడంలాంటి కారణాల వల్ల ఇప్పటికీ బంగారాన్ని సురక్షిత పెట్టుబడి సాధనంగానే మదుపరులు భావిస్తున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ మధ్య సగటున నెలకు రూ.298 కోట్ల మేరకు పెట్టుబడులు పసిడి ఈటీఎఫ్‌లలోకి వచ్చాయి. గత ఏడాది ఆగస్టులోనూ వీటిల్లోకి రూ.1,100 కోట్ల మేరకు వచ్చాయి. ఈ ఏడాది సెప్టెంబరు నాటికి గోల్డ్‌ ఈటీఎఫ్‌లలో మదుపు చేస్తున్న పోర్ట్‌ఫోలియోల సంఖ్య 48.06 లక్షలుగా ఉంది.

మరిన్ని వార్తలు