హెచ్‌ఏఎల్‌ ఓఎఫ్‌ఎస్‌కు డిమాండ్‌

24 Mar, 2023 04:47 IST|Sakshi

న్యూఢిల్లీ: రక్షణ రంగ పీఎస్‌యూ హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌) షేర్ల విక్రయానికి తొలి రోజు 4.5 రెట్లు అధిక స్పందన లభించింది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌)లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 3.5 శాతం వాటా(1.17 కోట్ల షేర్లు)ను విక్రయానికి ఉంచగా.. సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి భారీ డిమాండ్‌ కనిపించింది. శుక్రవారం రిటైల్‌ ఇన్వెస్టర్లు బిడ్‌ చేసేందుకు వీలున్న నేపథ్యంలో ప్రభుత్వం గ్రీన్‌ షూ ఆప్షన్‌ను వినియోగించుకోనుంది.

షేరుకీ రూ. 2,450 ధరలో ఓఎఫ్‌ఎస్‌ ద్వారా ప్రభుత్వం తొలుత 1.75% ఈక్విటీని(58.51 లక్షల షేర్లు) విక్రయానికి ఉంచింది. అధిక సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తే మరో 1.75% వాటాను సైతం అమ్మివేయనుంది. తద్వారా ప్రభుత్వానికి రూ. 2,867 కోట్లు లభించనున్నాయి. బుధవారం ముగింపు ధర రూ. 2,625తో పోలిస్తే 6.7% (రూ. 175) డిస్కౌంట్‌లో ప్రభుత్వం ఫ్లోర్‌ ధరను నిర్ణయించిన సంగతి తెలిసిందే. కంపెనీలో ప్రస్తుతం ప్రభుత్వానికి 75.15 శాతం వాటా ఉంది.

ఓఎఫ్‌ఎస్‌ నేపథ్యంలో హెచ్‌ఏఎల్‌ షేరు బీఎస్‌ఈలో 5 శాతం పతనమై రూ. 2,497 ఎగువన నిలిచింది.   

మరిన్ని వార్తలు