జీఎస్‌టీ వసూళ్లు హైజంప్‌

2 Jul, 2022 06:27 IST|Sakshi

జూన్‌లో రూ. 1.44 లక్షల కోట్లు

56 శాతం వృద్ధి నమోదు  

న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు ఫుల్‌ జోష్‌లో కొనసాగుతున్నాయి. ఈ ఏడాది జూన్‌లో ఏకంగా 56 శాతం ఎగసి రూ. 1.44 లక్షల కోట్లకు దూసుకెళ్లాయి. ఆర్థిక రికవరీ, సమర్థవంతమైన ఎగవేత వ్యతిరేక చర్యలు ఇందుకు దోహద పడినట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. గతేడాది(2021) జూన్‌లో జీఎస్‌టీ వసూళ్లు రూ. 92,800 కోట్లుగా నమోదయ్యాయి. వెరసి 2022 మార్చి నుంచి వరుసగా నాలుగో నెలలోనూ రూ. 1.4 లక్షల కోట్ల మార్క్‌ను దాటినట్లు ఆర్థిక శాఖ తెలియజేసింది. జీఎస్‌టీని ప్రవేశపెట్టాక ఈ స్థాయి వసూళ్లు ఇది ఐదోసారని వెల్లడించింది. కాగా.. జూన్‌ నెల వసూళ్లు కీలక స్థాయికి   నిదర్శనమంటూ జీఎస్‌టీ డే వేడుకల సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యానించారు.  

55 శాతం అప్‌: గతేడాది జూన్‌తో పోలిస్తే గత నెలలో వస్తు దిగుమతుల ఆదాయం 55% పురోగమించినట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. సర్వీసుల  తో కలిపి దేశీ లావాదేవీల ఆదాయం 56% ఎగసినట్లు తెలిపింది. 2022 మే నెలలో 7.3 కోట్ల ఈవే బిల్స్‌ నమోదుకాగా.. ఏప్రిల్‌లో 7.4 కోట్ల బిల్స్‌ జారీ అయ్యాయి.  ఈ ఏడాది మే నెలలో జీఎస్‌టీ వసూళ్లు రూ. 1.41 లక్షల కోట్లుకాగా, ఏప్రిల్‌లో రూ. 1.68 లక్షల కోట్లకు చేరాయి.

మరిన్ని వార్తలు