లక్ష్యంలో 37.3 శాతానికి ద్రవ్యలోటు

1 Nov, 2022 05:53 IST|Sakshi

సెప్టెంబర్‌ ముగిసే నాటికి రూ.6,19,849 కోట్లు

న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) మొదటి ఆరు నెలలూ ముగిసే నాటికి (సెప్టెంబర్‌) లక్ష్యంలో 37.3 శాతానికి చేరింది. మరిన్ని వివరాల్లో వెళితే, 2022–23లో ద్రవ్యలోటు రూ.16.61 లక్షల కోట్లుగా 2022 ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ నిర్దేశించింది. ఇదే ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాల్లో ఇది 6.4 శాతం. అయితే సెప్టెంబర్‌ ముగిసే నాటికి ద్రవ్యలోటు రూ.6,19,849 కోట్లకు చేరినట్లు సోమవారం వెలువడిన అధికారిక గణాంకాలు వెల్లడించాయి. కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ (సీజీఏ) విడుదల చేసిన గణాంకాలు ప్రకారం..

► సెప్టెంబర్‌ నాటికి పన్నులుసహా ప్రభుత్వ మొత్తం ఆదాయాలు రూ.12.03 లక్షల కోట్లు. 2022–23 బడ్జెట్‌ అంచనాల్లో ఇది 52.7 శాతం. ఇందులో ఒక్క పన్ను వసూళ్లు రూ.10.11 లక్షల కోట్లు. బడ్జెట్‌ అంచనాల్లో ఈ మొత్తం 52.3 శాతం.  
► ఇక ఇదే కాలంలో ప్రభుత్వ వ్యయాలు రూ.18.23 లక్షల కోట్లు. ఆర్థిక సంవత్సరం మొత్తం బడ్జెట్‌ అంచనాల్లో 46.2 శాతం.  
► వెరసి ద్రవ్యలోటు 6.20 లక్షల కోట్లుగా నమోదయ్యింది. 

మరిన్ని వార్తలు