ద్వితీయార్ధంలో ఖరీదైన గృహ విక్రయాల హవా

6 Jan, 2021 14:44 IST|Sakshi

రూ. 50 లక్షలకు పైబడిన ఇళ్ల వాటా 57 శాతం

అందుబాటు ధరల విభాగంలో 43 శాతం అమ్మకాలు

2020 జులై-డిసెంబర్‌ మధ్య గణాంకాల వెల్లడి

మెట్రో నగరాల్లో హైదరాబాద్‌ మార్కెట్‌ యమస్పీడ్‌ 

ముంబై, సాక్షి: రెసిడెన్షియల్‌ విభాగంలో ఈ కేలండర్‌ ఏడాది(2020) ద్వితీయార్ధంలో ఖరీదైన గృహ విక్రయాల హవా నమోదైంది. జులై-డిసెంబర్‌ మధ్య కాలంలో దేశీయంగా రూ. 50 లక్షల విలువకు పైబడిన ఇళ్ల అమ్మకాల వాటా 57 శాతాన్ని తాకింది. ఇదే సమయంలో అందుబాటు ధరల గృహ విక్రయాలు 43 శాతానికి పరిమితమయ్యాయి. ఇందుకు ప్రధానంగా కోవిడ్‌-19 కారణంగా తలెత్తిన ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ప్రభావం చూపినట్లు రియల్టీ రంగ విశ్లేషణ సంస్థ నైట్‌ ఫ్రాంక్‌ తెలియజేసింది. (రియల్టీ రంగానికి స్టీల్‌ షాక్‌)

హైఎండ్‌లో
ఈ ఏడాది విలాసవంత విభాగంలో గృహాల కొనుగోలుకి వినియోగదారులు అధిక ఆసక్తిని చూపినట్లు నైట్‌ ఫ్రాంక్‌ నివేదిక పేర్కొంది. మార్కెట్లో ప్రవేశించేందుకు 2020 అనుకూలమని అత్యధికులు భావించినట్లు తెలియజేసింది. దీనికితోడు ఆర్థికంగా పటిష్టస్థితిలో ఉన్న వర్గాలకు హౌసింగ్‌ రుణాల అందుబాటు తదితర అంశాలు జత కలసినట్లు వివరించింది. దీర్ఘకాలిక రుణ చెల్లింపుల సామర్థ్యం కలిగిన వ్యక్తులు గృహ కొనుగోళ్లకు ముందుకు వచ్చినట్లు అభిప్రాయపడింది.  (కొత్త కారు కొనాలా? 10 నెలలు ఆగాల్సిందే!)

హైదరాబాద్‌ టాప్‌
రెసిడెన్షియల్‌ విభాగంలో అధిక పరిమాణంలో అమ్మకాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలలో రియల్టీ కంపెనీలు కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టినట్లు నైట్‌ ఫ్రాంక్‌ వెల్లడించింది. ఈ విషయంలో త్రైమాసిక ప్రాతిపదికన ముంబై, పుణే 121 శాతం పురోగతిని చూపినట్లు పేర్కొంది. అయితే కొత్త ప్రాజెక్టులను ప్రవేశపెట్టడంలో హైదరాబాద్‌ 480 శాతం వృద్ధితో తొలి ర్యాంకులో నిలిచినట్లు పేర్కొంది. 2020 ద్వితీయార్థంలో మొత్తం 1,46,228 యూనిట్ల ప్రాజెక్టులు ప్రారంభమైనట్లు తెలియజేసింది. అయితే ఇవి అంతక్రితం ఏడాదితో పోలిస్తే 34 శాతం తక్కువేనని తెలియజేసింది.

మరిన్ని వార్తలు