ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ వాటా యూఎస్‌లో 63 శాతం, మరి భారత్‌లో ఎంతో తెలుసా?

5 Feb, 2023 16:09 IST|Sakshi

ముంబై: ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహన విక్రయాలు 2030 నాటికి భారత్‌లో 2.2 కోట్ల యూనిట్లకు చేరతాయని రెడ్‌సీర్‌ స్ట్రాటజీ కన్సల్టెంట్స్‌ నివేదిక వెల్లడించింది. అందుబాటు ధరలో రవాణా సౌకర్యాలకు డిమాండ్, కర్బన ఉద్గారాలను తగ్గించే లక్ష్యం ఇందుకు కారణమని వివరించింది. ‘2022లో దేశంలో జరిగిన మొత్తం వాహన విక్రయాల్లో ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ వాటా కేవలం 3 శాతమే.

అదే యూఎస్‌లో అయితే ఈవీల వాటా ఏకంగా 63 శాతం, చైనాలో 56 శాతం ఉంది. పెట్రోల్‌తో పోలిస్తే ఈవీలతో యాజమాన్య ఖర్చులు చాలా తక్కువ. అందుకే క్రమంగా కస్టమర్లు వీటికి మళ్లుతున్నారు. దిగుమతులను ఆసరాగా చేసుకుని చాలా బ్రాండ్లు ఈ రంగంలోకి ప్రవేశించాయి. మార్కెట్‌ పరిపక్వత చెంది, నిబంధనలు కఠినతరం అయితే ఈ రంగం ఏకీకృతం (కన్సాలిడేట్‌) అవుతుంది’ అని తెలిపింది.  

ప్రయాణ ఖర్చు తక్కువ.. 
‘కొత్త కొత్త బ్రాండ్ల చేరికతో మోడళ్లను ఎంపిక చేసుకోవడానికి కస్టమర్లకు అవకాశం ఉంటుంది. ఫీచర్లు, రోజువారీ వ్యయం, వాహన ధర ఆధారంగా ఈవీ కొనుగోలు నిర్ణయం తీసుకుంటున్నారు. కొనుగోలు ధర ఎక్కువగా ఉన్నప్పటికీ ఇంటర్నల్‌ కంబషన్‌ ఇంజన్‌ టూ వీలర్లతో పోలిస్తే ప్రయాణానికి అయ్యే ఖర్చు తక్కువ. ‘ఒకసారి చార్జింగ్‌ చేస్తే వాహనం ఎంత దూరం ప్రయాణిస్తుంది’ అన్న వినియోగదార్ల ఆందోళన పరిశ్రమకు పెద్ద అడ్డంకిగా ఉంది. ఈవీ అమ్మకాలు పెరిగేకొద్దీ సుదూర ప్రయాణాలకు బలమైన ఛార్జింగ్‌ మౌలిక సదుపాయాలు అవసరం అవుతుంది. ప్రధానంగా వేగంగా చార్జింగ్‌ పూర్తి అయ్యేలా ఫాస్ట్‌ చార్జింగ్‌ వసతులు ఉండాలి. ఈవీలు సింహ భాగం చేజిక్కించుకునే వరకు ఫేమ్, పీఎల్‌ఐ పథకాలు కొనసాగాలి’ అని నివేదిక వివరించింది.
   

>
మరిన్ని వార్తలు