19న ‘ఇండియా’ భేటీ

11 Dec, 2023 06:23 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు ఢిల్లీలో ఈ నెల 19న భేటీ కానున్నారు. ఈ సమావేశంలో సీట్ల పంపకం, ఉమ్మడి ఎజెండా, ఉమ్మడిగా ర్యాలీల నిర్వహణ వంటి కీలక అంశాలపై నేతలు ఒక అంగీకారానికి రావాల్సి ఉంది. కూటమి నాలుగో సమావేశం ఢిల్లీలో 19న సాయంత్రం 3 గంటలకు జరుగుతుందని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ‘ఎక్స్‌’లో ఆదివారం తెలిపారు.

ప్రధాని మోదీకి దీటుగా మనం, నేను కాదు(మై నహీ, హమ్‌)అనే ఐక్య ఇతివృత్తంతో ఇండియా కూటమి నేతలు ముందుకు సాగుతారని ఆయన చెప్పారు. రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో ఈ సమావేశం జరగనుండటం గమనార్హం. టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ సహా కీలక నేతలు ఈ భేటీకి హాజరవుతారని భావిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు