స్టార్టప్‌ రంగంలో భారత్ అగ్రస్థానం: మోదీ

28 Nov, 2021 15:38 IST|Sakshi

ప్రస్తుతం ప్రపంచంలో స్టార్టప్‌ల యుగం నడుస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో అన్నారు. ఈ స్టార్టప్‌ రంగంలో భారతదేశం ప్రపంచానికి నాయకత్వం వహిస్తోంది అని అన్నారు. దేశంలో గల 70కి పైగా స్టార్టప్‌ల విలువ 1 బిలియన్ డాలర్లను దాటాయి అని తెలిపారు. యువత జనాభా అధికంగా ఉన్న ఏ దేశంలోనైనా, మూడు అంశాలు- ఆలోచనలు-ఆవిష్కరణలు, రిస్క్ తీసుకునే సామర్థ్యం, ఏదైనా చేయగలమనే స్ఫూర్తి చాలా ముఖ్యమైనవని అని "మన్ కీ బాత్" రేడియో కార్యక్రమంలో మోదీ అన్నారు. 

ఈ మూడు విషయాలు కలిసి వచ్చినప్పుడు, అపూర్వమైన ఫలితాలు వస్తాయని, అద్భుతాలు జరుగుతాయని పేర్కొన్నారు. "ఈ రోజుల్లో మన చుట్టూ స్టార్టప్‌, స్టార్టప్‌, స్టార్టప్‌ వింటాము. ఇది స్టార్టప్‌ల శకం, ఈ స్టార్టప్‌ల రంగంలో ఒక విధంగా భారతదేశం ప్రపంచాన్ని నడిపిస్తోంది అనేది కూడా నిజం" అని మోదీ అన్నారు. ప్రతి ఏడాది స్టార్టప్‌లు రికార్డు స్థాయిలో పెట్టుబడులు ఆకర్షిస్తున్నాయని, ఈ రంగం వేగంగా పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. "దేశంలోని చిన్న నగరాల్లో కూడా స్టార్టప్‌ల వ్యాప్తి పెరిగింది. ఈ రోజుల్లో యునికార్న్ అనే పదం చాలా చర్చలో ఉంది. యునికార్న్ స్టార్టప్‌ల విలువ ఒక బిలియన్ డాలర్లు(సుమారు రూ.7,000 కోట్లు)" అని మోడీ అన్నారు. 

(చదవండి: పెన్షనర్లకు హై అలర్ట్.. ! రెండు రోజులే గడువు..లేదంటే..)

"2015 సంవత్సరం వరకు దేశంలో 9 నుంచి పది యునికార్న్స్ ఉండేవి, ఇప్పుడు భారతదేశం యునికార్న్స్ పరంగా ప్రపంచంలో అగ్రగామిగా ఉంది అనే విషయం తెలుసుకుంటే మీరు చాలా సంతోషిస్తారు. ఒక నివేదిక ప్రకారం.. ఈ సంవత్సరం 10 నెలల్లో ప్రతి 10 రోజులకు భారతదేశంలో ఒక స్టార్టప్‌ యునికార్న్ గా మారింది" అని ఆయన చెప్పారు. కోవిడ్ మహమ్మారి వంటి కష్ట కాలంలో దేశంలోని యువత ఈ గొప్ప విజయాన్ని సాధించారని ఆయన అన్నారు. "నేడు, భారతదేశంలో 70కి పైగా యునికార్న్స్ ఉన్నాయి అని, వీటి విలువ 1 బిలియన్ డాలర్లను దాటాయి" అని మోడీ అన్నారు.

మరిన్ని వార్తలు