ఐటీ కంపెనీల్లో అత్యధిక వేతనం ఈయనకే

9 Aug, 2021 13:02 IST|Sakshi

సాక్షి, వెబ్‌డెస్క్‌: చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌కి అత్యధిక శాలరీ ఇస్తున్న ఐటీ సంస్థగా హెచ్‌సీఎల్‌ రికార్డు సృష్టించింది. మిగిలిన ఐటీ సంస్థలను వెనక్కి నెట్టిన కంపెనీ తమ సీఈవో వియజ్‌కుమార్‌కి అత్యధిక వేతనం కట్టబెట్టింది. ఇటీవల ఆ కంపెనీ విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది. 

సీఈవో విజయ్‌ కుమార్‌
నోయిడా కేంద్రంగా ఐటీ సర్వీసులు అందిస్తోన్న హెచ్‌సీఎల్‌ దేశంలోనే మూడో అతి పెద్ద ఐటీ సంస్థగా గుర్తింపు పొందింది. ఆ సంస్థకు 2016 అక్టోబరు నుంచి సీఈవోగా విజయ్‌కుమార్‌ వ్యవహరిస్తున్నారు. ఇటీవల హెచ్‌సీఎల్‌ వ్యవస్థాపకుడు శివకుమార్‌నాడర్‌ బోర్డు బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత ఎండీగా కూడా విజయ్‌కుమార్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 

హయ్యస్ట్‌ శాలరీ
ఇటీవల హెచ్‌సీఎల్‌ విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ కంపెనీ సీఈవో విజయ్‌ కుమార్‌ మూల వార్షిక వేతనాన్ని రెండు మిలియన్‌ డాలర్లుగా నిర్ణయించింది. దీంతో పాటు ఇతర అలవెన్సులు కలిపితే మొత్తం వేతనం 4.38 మిలియన్‌ డాలర్లుకు చేరుకుంది. భారతీయ కరెన్సీలో ఈ మొత్తం రూ 32.54 కోట్లుగా ఉంది. వార్షిక వేతనంతో పాటు 31.50 మిలియన్‌ డాలర్ల విలువైన షేర్లు సైతం కట్టబెట్టింది. దీంతో ఆయన వార్షిక వేతనం దాదాపు 10.80 మిలియన్‌ డాలర్లకు చేరుకుంది. ఇండియన్‌ కరెన్సీలో ఈ వేతనం  రూ.80.19 కోట్లగా ఉంది. 2026 మార్చి వరకు ఆయన ఈ వేతనం పొందుతారు.

విప్రోని దాటి
ఐటీ కంపెనీలకు సంబంధించి ఇప్పటి వరకు విప్రో సీఈవో థైరీ డెలాపోర్టే 8.8 మిలియన్‌ డాలర్ల వార్షిక వేతనమే హయ్యస్ట్‌. తాజాగా హెచ్‌సీఎల్‌ సీఈవో దీన్ని అధిగమించారు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఇన్ఫోసిస్‌ సీఈవో సలీల్‌ పరేఖ్‌ వేతనం 6.78 మిలియన్‌ డాలర్లు, టీసీఎస్‌ సీఈవో రాజేశ్‌ గోపినాథ్‌ వేతనం 2.8 మిలియన్‌ డాలర్లుగా ఉంది. 
 

మరిన్ని వార్తలు