World First AI CEO: సెలవు తీసుకోకుండా పనిచేస్తా.. దిగ్గజాలను భయపెడుతున్న కొత్త 'సీఈఓ'

11 Nov, 2023 16:37 IST|Sakshi

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాకతో ఉద్యోగాలు పోతాయని, మానవాళికి ముప్పు తలపెడుతుందనుకుంటున్న సమయంలో ఒక కంపెనీ ఏకంగా 'రోబో'ను సీఈఓగా నియమించి దిగ్గజాలకు సైతం దిగులుపుట్టేలా చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

కొలంబియాలోని కార్టజేనాలో ఉన్న డిక్టేడార్ స్పిరిట్ బ్రాండ్ ఏఐ బేస్డ్ రోబో 'మికా' (Mika)ను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా నియమించింది. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. మికా అనేది హాన్సన్ రోబోటిక్స్ హ్యూమనాయిడ్ రోబో. ఇది మనుషుల కంటే వేగంగా పనిచేస్తుంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్‌లతో ఖచ్చితమైన డేటా ఆధారాలతో నిర్ణయాలు తీసుకోగలనని డిక్టేడార్ కంపెనీ వీడియోలో మికా వెల్లడించింది. అంతే కాకకుండా 24/7 అందుబాటులో ఉంటానని, వారాంతపు సెలవులు అవసరం లేదని ప్రస్తావిస్తూ.. కంపెనీ ప్రయోజనాలకు అవసరమయ్యే ఏ పనైనా పక్షపాతం లేకుండా చేస్తానని స్పష్టం చేసింది. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, ఫేస్‌బుక్ సీఈఓ జుకర్‌బర్గ్‌ల కంటే కూడా మెరుగ్గా పనిచేస్తానని మికా (హ్యూమనాయిడ్ రోబో) నొక్కి చెప్పించి. 

కంప్యూటర్ యుగంలో ఏఐ టెక్నాలజీ గురించి తప్పకుండా అవగాహన కలిగి ఉండాలని, రానున్న రోజుల్లో ఏఐ టెక్నాలజీ అవసరం ఎంతైనా ఉందని హాన్సన్ రోబోటిక్స్ సీఈఓ 'డేవిడ్ హాన్సన్' (David Hanson) తెలిపారు.

ఇదీ చదవండి: ఏ ప్రశ్నకైనా సమాధానం 'చాట్‌జీపీటీ' - ఇంటర్వ్యూకి ఇలా సిద్దమైపోండి!

ఏఐ వల్ల ప్రమాదమా!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మానవాళికి ముప్పు ఉందని గత కొంతకాలంగా చాలా మంది భయపడుతున్నారు. కృత్రిమ మేధను సరిగా వాడకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని గూగుల్‌ సీఈఓ 'సుందర్‌ పిచాయ్‌' ఇప్పటికే హెచ్చరించారు. ముప్పు నుంచి బయటపడాలంటే ఏఐ సాంకేతికతపై నియంత్రణ ఉండాలని చెప్పారు.

ఉద్యోగుల పనితీరుని మెరుగుపరచడంలో ఏఐ ఉపయోగపడుతుందని, టెక్నాలజీని ఉపయోగించి ఇప్పటికే కొన్ని సంస్థలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని మరికొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ.. ఏఐ వల్ల ఉద్యోగాలు పోయే అవకాశం లేదని చెబుతున్నారు.

మరిన్ని వార్తలు