పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా తగ్గనున్నాయా..?

17 Mar, 2022 14:39 IST|Sakshi

3 మిలియన్‌ బ్యారెళ్ల కొనుగోలు

అంతర్జాతీయ మార్కెట్‌ కంటే చాలా తక్కువ ధర

న్యూఢిల్లీ: రష్యా ఆఫర్‌కు భారత్‌ వేగంగా స్పందించడమే కాదు, చౌక చమురుకు ఆర్డర్‌ కూడా చేసేసింది. అంతర్జాతీయ ధర కంటే చాలా చౌకగా 3 మిలియన్‌ బ్యారెళ్ల ముడి చమురు కొనుగోలుకు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ) ఆర్డర్‌ ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఒక ట్రేడర్‌ ద్వారా ఈ డీల్‌ జరిగినట్టు చెప్పాయి. మే నెలకు సంబంధించి ఉరల్స్‌ క్రూడ్‌ను.. బ్రెంట్‌ క్రూడ్‌ ధర కంటే 20–25 డాలర్లు తక్కువకు ఐవోసీ కొనుగోలు చేసింది.

ఆర్థిక ఆంక్షల నేపథ్యంలో మిత్రదేశమైన భారత్‌కు మార్కెట్‌ ధర కంటే తక్కువకు ముడి చమురు సరఫరా చేస్తామంటూ కొన్ని రోజుల క్రితం రష్యా స్వయంగా ఆఫర్‌ చేయడం గమనార్హం. దీంతో ఐవోసీ మొదటి ఆర్డర్‌ ఇచ్చింది. దీని కింద విక్రయదారు భారత తీరం వరకు రవాణా చేసి డెలివరీ చేయాల్సి ఉంటుంది. దీంతో రవాణా పరంగా సమస్యలు ఏర్పడినా ఆ బాధ్యత ఐవోసీపై పడకుండా చూసుకుంది. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఆరంభించగా..పాశ్చాత్య దేశాలు పెద్ద ఎత్తున ఆర్థిక ఆంక్షలు విధించడం తెలిసిందే. రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించినా, ఆయిల్, ఇతర ఇంధనాలను మినహాయించారు. కనుక ఇంధన కొనుగోలు డీల్స్‌ ఆంక్షల పరిధిలోకి రావు.   

>
మరిన్ని వార్తలు