Lambretta: 40 ఏళ్ల కిత్రం ఆ స్కూటర్‌ క్రేజ్‌ వేరబ్బా.. మళ్లీ స్టైలిష్‌ లుక్‌తో వచ్చేస్తోంది!

6 Sep, 2022 16:59 IST|Sakshi

ఒకప్పుడు ఆటో మొబైల్‌ రంగాన్ని ఏలిన లాంబ్రెట్టా స్కూటర్‌ కంపెనీ మరోసారి భారత్‌లో తన మార్క్‌ని చూపెట్టేందుకు సిద్ధమైంది. అందుకోసం 1970లో కస్టమర్లను తనవైపు తిప్పుకుని  భారత రోడ్లపై రయ్‌ రయ్‌ మంటూ తిరిగిన లాంబ్రెట్టా స్కూటర్లును .. 2023లో లేటెస్ట్‌ మోడల్‌తో తిరిగి అందుబాటులోకి తీసుకురానుంది. కొత్తగా రానున్న మోడల్స్‌లో 200, 350సీసీ ఇంజిన్స్‌తో ఈ స్కూటర్లు రానున్నాయి. వీటితో పాటు 2024 చివరి నాటికి ఎలక్ట్రిక్‌  వాహనాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ ప్రకటించింది. బర్డ్ గ్రూప్‌తో జాయింట్ వెంచర్‌లో భాగంగా ఈ కంపెనీ మార్కెట్లోకి ఈ స్కూటర్లను తీసుకురాబోతున్నాయి.
 
కంపెనీ ముఖ్య అధికారి మాట్లాడుతూ.. బర్డ్ గ్రూప్‌తో కలిసి వచ్చే 5 సంవత్సరాలలో $200 మిలియన్లకు పైగా ఈ రంగంలో పెట్టుబడి పెడుతున్నట్లు చెప్పారు. 1970లో భారత్‌ మార్కెట్లో ఈ స్కూటర్‌ బ్రాండ్‌కి ప్రత్యేక గుర్తింపుతో పాటు కస్టమర్లలో వీటికి విపరీతమైన క్రేజ్‌ ఉండేదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని కొత్త రకం స్కూటర్ల మోడళ్లను డిజైన్‌, లుక్‌, ఫీచర్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు.


త్వరలో విడుదల కానున్న స్కూటర్లతో కంపెనీకి భారత్‌లో ఉన్న గత వైభవాన్ని తిరిగి తీసుకురావడమే తాము లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ స్కూటర్‌లు హై-ఎండ్ మోడల్స్‌గా, మార్కెట్‌లో ప్రస్తుతం ఉన్న అత్యంత ఖరీదైన మోడల్‌ల కంటే దాదాపు 20% ఖరీదు ఉంటుందని అంచనా. ఈ జాయింట్ వెంచర్‌లో లాంబ్రెట్టా 51% వాటా ఉండగా, మిగిలిన 49% బర్డ్ గ్రూప్ కొనుగోలు చేసింది. 

ఎలక్ట్రిక్ లాంబ్రెట్టా స్కూటర్ 2023లో మిలన్ మోటార్‌సైకిల్ షోలో ప్రజలకు ప్రదర్శించబోతోంది. అదే మోడల్‌ను భారత్‌లో స్థానికంగా ఉత్పత్తి చేయాలని చూస్తోంది. లాంబ్రెట్టా ప్రస్తుతం దాదాపు 70 దేశాల్లో తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది.

మరిన్ని వార్తలు