ఎల్‌టీఐ–మైండ్‌ట్రీ ఆవిర్భావం

15 Nov, 2022 04:51 IST|Sakshi

ఐటీ సేవలకు ఆరవ పెద్ద కంపెనీ

ముంబై: డైవర్సిఫైడ్‌ దిగ్గజం ఎల్‌అండ్‌టీ గ్రూప్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్, మైండ్‌ట్రీ లిమిటెడ్‌ విలీనమయ్యాయి. ఎల్‌టీఐ–మైండ్‌ట్రీ పేరుతో కొత్త సంస్థ ఏర్పాటైనట్లు ఎల్‌అండ్‌టీ తాజాగా వెల్లడించింది. దీంతో సంయుక్త సంస్థ దేశీ ఐటీ సర్వీసుల రంగంలో 5.25 బిలియన్‌ డాలర్ల ఆదాయంతో ఆరో పెద్ద కంపెనీగా ఆవిర్భవించినట్లు తెలియజేసింది. విలీనం వెనువెంటనే అమల్లోకి వచ్చినట్లు ఎల్‌అండ్‌టీ గ్రూప్‌ చైర్మన్‌ ఏఎం నాయక్‌ ప్రకటించారు.

ఎల్‌టీఐ మైండ్‌ట్రీలో ట్రేడింగ్‌ 24 నుంచి ప్రారంభంకానున్నట్లు వెల్లడించారు. రూ. 1.53 లక్షల కోట్ల(సోమవారం ముగింపు) మార్కెట్‌ విలువతో సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఐదో ర్యాంకులో నిలుస్తున్నట్లు తెలియజేశారు. విలీన సంస్థలో ఎల్‌అండ్‌టీ 68.73 శాతం వాటాను కలిగి ఉంది. విలీనంలో భాగంగా మైండ్‌ట్రీ వాటాదారులకు తమవద్ద గల ప్రతీ 100 షేర్లకు 73 ఎల్‌టీఐ షేర్లు జారీ చేయనున్నట్లు నాయక్‌ తెలియజేశారు. ఇందుకు ఈ నెల 24 రికార్డ్‌ డేట్‌గా నిర్ణయించారు. ఈ ఏడాది మే నెలలో రెండు కంపెనీల విలీనానికి తెరతీసిన సంగతి తెలిసిందే.
విలీనం నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో మైండ్‌ట్రీ షేరు 2.7 శాతం ఎగసి రూ. 3,760 వద్ద, ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌ 2 శాతం బలపడి రూ. 5,161 వద్ద ముగిశాయి.

మరిన్ని వార్తలు