ఎల్‌జీ బాలకృష్ణన్‌- ఇప్కా ల్యాబ్స్‌ జూమ్‌

27 Oct, 2020 13:01 IST|Sakshi

187 పాయింట్లు ఎగసిన సెన్సెక్స్‌

క్యూ2లో ఆకర్షణీయ ఫలితాలు

9 శాతం జంప్‌చేసిన ఎల్‌జీ బాలకృష్ణన్‌

 క్యూ2 ఫలితాలపై అంచనాలు

ఇప్కా ల్యాబొరేటరీస్‌ 9 శాతం అప్

‌సరికొత్త గరిష్టాన్ని తాకిన షేరు

ఆటుపోట్ల మధ్య ప్రారంభమైన దేశీ మార్కెట్లు జోరందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 187 పాయింట్లు పెరిగి 40,332కు చేరగా.. నిఫ్టీ 63 పాయింట్లు బలపడి 11,831 వద్ద ట్రేడవుతోంది. కాగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ఎల్‌జీ బాలకృష్ణన్‌ అండ్‌ బ్రదర్స్‌ అంచనాలకు అనుగుణమైన ఫలితాలు ప్రకటించింది. ఈ బాటలో క్యూ3పై అంచనాలు పెరగడంతో ఈ ఆటో విడిభాగాల కంపెనీ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. మరోపక్క క్యూ2లో ఆకర్షణీయ పనితీరు చూపనున్న అంచనాలతో హెల్త్‌కేర్‌ రంగ కంపెనీ ఇప్కా ల్యాబొరేటరీస్‌ కౌంటర్‌ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు షేర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

ఎల్‌జీ బాలకృష్ణన్‌
ఈ ఆర్థిక సంవత‍్సరం క్యూ2(జులై- సెప్టెంబర్‌)లో ఎల్‌జీ బాలకృష్ణన్‌ నికర లాభం దాదాపు 24 శాతం క్షీణించి రూ. 28 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం మాత్రం నామమాత్ర వృద్ధితో రూ. 412 కోట్లను తాకింది. అయితే ఇటీవల ఆటో రంగం జోరందుకోవడంతో క్యూ3(అక్టోబర్‌- డిసెంబర్‌)లో మరింత మెరుగైన పనితీరును చూపవచ్చన్న అంచనాలు పెరిగినట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఎల్‌జీ బాలకృష్ణన్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 9 శాతం దూసుకెళ్లి రూ. 272 వద్ద ట్రేడవుతోంది.

ఇప్కా ల్యాబొరేటరీస్‌
ఈ ఆర్థిక సంవత‍్సరం క్యూ2(జులై- సెప్టెంబర్‌)లో ఇప్కా ల్యాబొరేటరీస్‌ ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించనున్న అంచనాలు పెరిగాయి. దీంతో ఎన్‌ఎస్‌ఈలో తొలుత ఇప్కా ల్యాబ్‌ షేరు 9 శాతం దూసుకెళ్లింది. రూ. 2,319 సమీపంలో సరికొత్త గరిష్టానికి చేరింది. ప్రస్తుతం కొంత వెనకడుగు వేసి 5.5 శాతం లాభంతో రూ. 2,240 వద్ద ట్రేడవుతోంది. ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌- జూన్‌)లో కంపెనీ నికర లాభం మూడు రెట్లు జంప్‌చేసి రూ. 129 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం 41 శాతం పెరిగి రూ. 1,546 కోట్లకు చేరింది. కాగా.. యాంటీమలేరియల్‌ బిజినెస్‌లో గ్లోబల్‌ ఫండ్‌ నుంచి మద్దతు లభించడం, యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి దిగుమతులపై అడ్డంకులు తొలగిపోవడం వంటి అంశాలు కంపెనీ పనితీరుకు దోహదపడగలవని ఆగస్ట్‌ నివేదికలో రేటింగ్‌ దిగ్గజం క్రిసిల్‌ పేర్కొంది. ఇది ఇన్వె‍స్టర్లకు హుషారునిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు