Lufthansa Pilots Strike: 800 ఫ్లైట్స్‌ రద్దు, ప్రయాణీకులు గగ్గోలు

2 Sep, 2022 11:57 IST|Sakshi

న్యూఢిల్లీ: జర్మనీ విమానయాన సంస్థ లుఫ్తాన్సాకు పైలట్ల మెరుపు సమ్మె సెగ తగిలింది.  లుఫ్తాన్సా పైలట్ల  యూనియన్‌  సమ్మెకు పిలుపునివ్వడంతో దాదాపు అన్ని ప్రయాణీకుల,  కార్గో విమానాలను రద్దు చేస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. దీంతో టికెట్లు బుక్‌ చేసుకున్న వారు ప్రపంచవ్యాప్తంగా  ఇబ్బందుల్లో పడిపోయారు.  దాదాపు 800 విమానాలు రద్దు కానున్నాయని లుఫ్తాన్సా వెల్లడించింది. వేసవి సెలవుల ముగింపు తరువాత తిరిగొచ్చే అనేక మంది ప్రయాణికులపై ప్రభావం చూపుతోంది. అయితే తన బడ్జెట్ క్యారియర్ యూరోవింగ్స్ ప్రభావితం కాదని లుఫ్తాన్సా పేర్కొంది.

పైలట్ల సమ్మె ప్రభావాలను తగ్గించడానికి సాధ్యమైనదంతా చేస్తున్నట్లు ఎయిర్‌లైన్ ప్రకటించినా ప్రయాణీకులకు ఇబ్బందులుత ప్పలేదు. ముఖ్యంగా న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 3 డిపార్చర్ గేట్ 1 వద్ద దాదాపు 150 మంది ప్రయాణీకులు ఆందోళనకు దిగారు. ఫ్రాంక్‌ఫర్ట్ , మ్యూనిచ్ నుండి రెండు లుఫ్తాన్స విమానాలు ఢిల్లీలో ల్యాండ్ కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రయాణీకుల బంధువులు ఆందోళనలో పడిపోయారు. డబ్బు వాపసు ఇవ్వండి లేదా తమ వారికి ప్రత్యామ్నాయ విమాన ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇతర విమానయాన సంస్థల ద్వారా ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని  సంబంధిత అధికారులు చెప్పడంతో పరిస్థితి సద్దు మణిగింది. 

కాగా వేతనాల పెంపును కోరుతూ లుఫ్తాన్సా పైలట్లు అకస్మాత్తుగా భారీ సమ్మెకు దిగారు. తమ డిమాండ్లను యాజమాన్యం తిరస్కరించినక కారణంగా సమ్మె తప్ప లేదని  పైలట్ల సంఘం వెల్లడించింది. అయితే కంపెనీ ఇప్పటికే ఉద్యోగుల జీతాలను 900 యూరోల (900 అమెరికా డాలర్లు) ఒక్కసారిగా పెంచింది. సీనియర్ పైలట్‌లకు 5 శాతం, కొత్తవారికి  వారికి 18 శాతం పెంపును ప్రకటించింది.  కనీ 2023లో అధిక ద్రవ్యోల్బణం అంచనాల నేపథ్యంలో ఈ సంవత్సరం 5.5 శాతం పెంచాలని పైలట్లు యూనియన్ డిమాండ్‌ చేస్తోంది.

మరిన్ని వార్తలు