Microsoft: హైదరాబాద్‌లో డేటా సెంటర్‌.. మైక్రోసాఫ్ట్‌ భారీ పెట్టుబడులు

21 Jan, 2022 11:29 IST|Sakshi

Microsoft, Telangana seal deal: ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఫార్మా రంగాల్లో ఇప్పటికే తన ప్రత్యేకతను చాటుకున్న హైదరాబాద్‌ ఫ్యూచర్‌ టెక్నాలజీలకు అనుగుణంగా సిద్ధమవుతోంది. దీంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు భారీ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. క్లౌడ్‌ కంప్యూటింగ్‌, డేటా స్టోరేజీ, స్పేస్‌ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ రంగాలకు మంచి భవిష్యత్తు ఉందని అందరూ చెబుతున్న మాట. దీనికి తగ్గట్టే తెలంగాణ సర్కారు ఇప్పటికే డేటా సెంటర్‌ పాలసీనీ తీసుకువచ్చింది. దేశంలో ఈ పాలసీ తీసుకువచ్చిన అతి కొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. దీంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు మైక్రోసాఫ్ట్‌ రెడీ అయినట్టు సమాచారం.

త్వరలో
తెలంగాణలో డేటా సెంటర్‌ ఏర్పాటు చేయాల్సిందిగా ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌కి తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం పంపింది. ఈ మేరకు మైక్రోసాఫ్ట్‌, తెలంగాణ సర్కార్‌ల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయి. కాగా హైదరాబాద్‌లో డేటా సెంటర్‌ ఏర్పాటుకు 50 ఎకరాల స్థలం అవసరం కానుంది. కొత్తగా నెలకొల్పబోయే డేటా సెంటర్‌ కోసం రూ.15 వేల కోట్ల రూపాయలను మైక్రోసాఫ్ట్‌ కేటాయించనున్నట్టు సమాచారం. మరో నెల రోజుల్లో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుందని బిజినెస్‌ స్టాండర్డ్‌ కథనం ప్రచురించింది. అయితే హైదరాబాద్‌లో డేటా సెంటర్‌ ఏర్పాటు విషయంలో ఇటు తెలంగాణ సర్కాను, మైక్రోసాఫ్ట్‌ల నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. 
 

మరిన్ని వార్తలు