ద్రవ్యోల్బణాన్ని గమనిస్తూనే ఉన్నాం

22 Dec, 2022 12:35 IST|Sakshi

న్యూఢిల్లీ: అధిక స్థాయిలో ఉన్న ద్రవ్యోల్బణాన్ని ప్రభుత్వం గమనిస్తూనే ఉందని, ధరల భారం పెరగకుండా చూస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ భరోసా ఇచ్చారు. కరోనా మహమ్మారి రాకతో ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారిపోకుండా, పైకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అనుసరించిన లకి‡్ష్యత విధానాలు తోడ్పడినట్టు చెప్పారు. రాజ్యసభలో మధ్యంతర నిధుల బిల్లుపై చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టోకు ద్రవ్యోల్బణం 21 నెలల కనిష్ట స్థాయికి తగ్గినట్టు చెప్పారు.

ఈ బిల్లు ఆమోదంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం అదనంగా రూ.3.25 లక్షల కోట్లను వ్యయం చేసేందుకు అవకాశం ఉంటుంది. బిల్లును లోక్‌సభ సైతం ఆమోదించడం గమనార్హం. పన్నుల వసూళ్లు బలంగా ఉన్నాయని వివరిస్తూ.. ప్రభుత్వం ఖర్చు చేసే రూ.3.25 లక్షల కోట్ల అదనపు వ్యయాలకు తగిన వనరులున్నాయని, ద్రవ్యలోటు లక్ష్యాన్ని మించదని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.

2022–23 సంవత్సరానికి జీడీపీలో ద్రవ్యలోటు లక్ష్యాన్ని కేంద్రం 6.4 శాతంగా పేర్కొనడం గమనార్హం. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాలు, ఇతర అనుకూల విధానాలతో ప్రైవేటు మూలధన నిధుల వ్యయాలు పుంజుకుంటున్నాయని మంత్రి సీతారామన్‌ చెప్పారు. బ్యాంకుల స్థూల ఎన్‌పీఏలు 2022 మార్చి నాటికి, ఆరేళ్ల కనిష్ట స్థాయి అయిన 5.9 శాతానికి తగ్గినట్టు సభకు తెలిపారు. మధ్యంతర నిధుల డిమాండ్లు అన్నవి ఆహార భద్రత, ఎరువుల సబ్సిడీల కోసం, దేశ ఆర్థిక వ్యవస్థకు మద్దతు నిచ్చేందుకేనని వివరించారు.

చదవండి: లక్ష్మీ మిట్టల్‌, డొనాల్డ్‌ ట్రంప్‌ అల్లుడితో ఎలాన్‌ మస్క్‌

మరిన్ని వార్తలు