అదానీ పవర్‌పై ఎక్స్ఛేంజీల కన్ను

24 Mar, 2023 03:58 IST|Sakshi

అదనపు పర్యవేక్షణ చర్యలు

న్యూఢిల్లీ: స్టాక్‌ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ తాజాగా అదానీ పవర్‌ కౌంటర్‌ను స్వల్పకాలిక అదనపు పర్యవేక్షణ చర్యల(ఏఎస్‌ఎం) మార్గదర్శకాలలోకి తీసుకువచ్చాయి. వెరసి ఈ నెల 23 నుంచి అదానీ పవర్‌ స్వల్పకాలిక ఏఎస్‌ఎం మార్గదర్శకాల తొలి దశ జాబితాలోకి చేరింది. ఈ అంశాన్ని రెండు ఎక్సే్ఛంజీలు విడిగా పేర్కొన్నాయి. సోమవారమే అదానీ గ్రూప్‌లోని అదానీ గ్రీన్‌ ఎనర్జీ, ఎన్‌డీటీవీ స్టాక్స్‌ను ఎక్సే్ఛంజీలు దీర్ఘకాలిక ఏఎస్‌ఎం రెండో దశ నుంచి స్టేజ్‌–1కు బదిలీ చేశాయి.

ఇక ఈ నెల 8న అదానీ పవర్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ విల్మర్‌లను స్వల్పకాలిక ఏఎస్‌ఎంలో చేర్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ నెల 17 నుంచి వీటిని స్వల్పకాలిక ఏఎస్‌ఎం నుంచి తప్పించాయి. ఏఎస్‌ఎం పరిధిలోకి చేర్చేందుకు గరిష్ట, కనిష్ట వ్యత్యాసాలు, క్లయింట్ల దృష్టి, సర్క్యూట్‌ బ్రేకర్లను తాకడం, పీఈ నిష్పత్తి తదితర అంశాలను స్టాక్‌ ఎక్సే్ఛంజీలు పరిగణించే విషయం విదితమే. స్వల్పకాలిక ఏఎస్‌ఎంలో చేర్చిన స్టాక్‌లో ఓపెన్‌ పొజిషన్లకు 50 శాతం లేదా ప్రస్తుత మార్జిన్‌ ఏది ఎక్కువైతే అది వర్తిస్తుంది. గరిష్టంగా 100 శాతం మార్జిన్‌ రేటు పరిమితి ఉంటుంది.

మరిన్ని వార్తలు