న్యూఇయ‌ర్ సెంటిమెంట్ వ‌ర్కౌట్ అవ్వ‌లే, ప‌డిపోయిన ప్యాసింజర్ వెహిక‌ల్స్ అమ్మ‌కాలు!

8 Feb, 2022 09:00 IST|Sakshi

కొత్త సంవ‌త్స‌రం ఆటోమొబైల్ సంస్థ‌లకు ఏమాత్రం క‌లిసిరాలేదంటూ కొన్ని నివేదిక‌లు వెలుగులోకి వ‌చ్చాయి. న్యూఇయ‌ర్ సెంటి మెంట్ కార‌ణంగా ఆయా ప్రొడ‌క్ట్ ల సేల్స్ భారీ ఎత్తున జ‌రుగుతాయి. కానీ ఆటోమొబైల్ రంగంలో అందుకు భిన్నంగా సేల్స్ జ‌రిగిన‌ట్లు వెలుగులోకి వ‌చ్చిన నివేదిక‌ల్లో పేర్కొన్నాయి.  గ‌తేడాదికంటే ఈఏడాది ప్యాసింజ‌ర్ వెహిక‌ల్స్ అమ్మ‌కాలు ప‌డిపోవ‌డం అందుకు నిద‌ర్శ‌న‌మ‌ని స్ప‌ష్టం చేస్తున్నాయి. 

అయితే ప్యాసింజ‌ర్ వెహికల్స్ పడిపోవ‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయ‌ని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌డీలర్స్‌ అసోసియేషన్స్‌ (ఎఫ్‌ఏడీఏ) తెలిపింది.ముఖ్యంగా సెమీ కండ‌క్ట‌ర్ల కొర‌త‌తో పాటు కోవిడ్ కేసులు పెరిగిపోవడం, ఒమిక్రాన్ వ్యాప్తితో పాటు లాక్ డౌన్ విధిస్తార‌నే వార్త‌లు జోరందుకోవ‌డం వంటి అంశాలు కొనుగోలు దారులపై ప‌డిన‌ట్లు ఎఫ్ఏడీఏ ప్ర‌తినిధులు తెలిపారు. 

దేశవ్యాప్తంగా జనవరిలో ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాలు 10.12 శాతం తగ్గాయి. 2021తో పోలిస్తే ఈ ఏడాది జనవరిలో రిటైల్‌ విక్రయాలు 2,87,424 నుంచి 2,58,329 యూనిట్లకు వచ్చి చేరాయి. సెమికండక్టర్ల కొరత ఇందుకు కారణమని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌డీలర్స్‌ అసోసియేషన్స్‌ (ఎఫ్‌ఏడీఏ) తెలిపింది. ద్విచక్ర వాహన విక్రయాలు 13.44 శాతం తగ్గి 10,17,785 యూనిట్లుగా ఉంది.   
 

మరిన్ని వార్తలు