జియో సంచలన ప్రకటన: ‘5జీ’ కోసం ఏకంగా వెయ్యి నగరాల్లో..

22 Jan, 2022 17:47 IST|Sakshi

Reliance Jio About 5G Plan: దేశంలోనే అతిపెద్ద టెలికాం నెట్‌వర్క్‌ రిలయన్స్‌ జియో భారీ ప్రణాళికకు సిద్ధమైంది. దేశవ్యాప్తంగా వెయ్యి నగరాల్లో 5జీ నెట్‌వర్క్‌ కవరేజ్‌ను విస్తరించేందుకు ప్లానింగ్‌ పూర్తి చేసుకున్నట్లు ప్రకటించింది.


అంతేకాదు ఫైబర్ సామర్థ్యాన్ని పెంపొందించడంతోపాటు ఆయా సైట్‌లలో పైలట్‌ను నిర్వహిస్తోంది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం జరిగిన ఓ ప్రదర్శనలో జియో ఇన్ఫోకామ్‌ ప్రెసిడెంట్‌ కిరణ్‌ థామస్‌ వివరాల్ని వెల్లడించారు. 

దేశవ్యాప్తంగా 1,000 టాప్‌ సిటీలకు 5G కవరేజ్ ప్లానింగ్ పూర్తయింది. 5జీ టెక్నాలజీతో హెల్త్ కేర్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్ లో అధునాతన సదుపాయాలను ఉపయోగించి జియో ట్రయల్స్‌ను కొనసాగిస్తున్నట్లు ప్రకటించుకుంది. అంతేకాదు త్రీడీ మ్యాప్స్‌, రే ట్రేసింగ్‌ టెక్నాలజీ ద్వారా 5జీ సేవల సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నట్లు థామస్‌ తెలిపారు. నెట్‌వర్క్‌ ఫ్లానింగ్‌ కోసం అత్యాధునిక సేవల్ని వినియోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. 

ఇదిలా ఉంటే జియో యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ రూ.151.6 కు పెరిగింది. కిందటి ఏడాదితో పోలిస్తే ఇది 8.6 శాతం ఎక్కువ.  ఇటీవల జియో తన ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను పెంచిన విషయం తెలిసిందే. 

2021 డిసెంబర్ నాటికి భారత్ లో జియో వినియోగదారుల సంఖ్య 42.1 కోట్లకు చేరింది. 2020తో పోలిస్తే దాదాపు కోటి మంది వినియోగదారులు జియోకు పెరిగారు. స్పెక్ట్రమ్ సంబంధిత బకాయిలన్నింటినీ టెలికం శాఖకు జియో ఇటీవలే ముందస్తుగా చెల్లించింది. 2021 మార్చి వరకు వడ్డీతో కలిపి మొత్తంగా రూ.30,791కోట్ల చెల్లింపు చేసింది. 5g స్పెక్ట్రమ్ వేలం ఈ వేసవిలోపే జరిగే అవకాశం ఉండగా.. ఈ లోపు జియో కసరత్తులు పూర్తి చేసుకోవడంతో పాటు 6జీ మీద ఫోకస్‌ చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు