ముకేశ్‌ అంబానీకి సెబీ జరిమానా సరికాదు

5 Dec, 2023 04:59 IST|Sakshi

మరో రెండు సంస్థలకూ ఇదే ఆదేశం వర్తింపు

ఆర్‌పీఎల్‌ షేర్ల అవకతవకల ఆరోపణలపై శాట్‌ రూలింగ్‌  

న్యూఢిల్లీ: రిలయన్స్‌ పెట్రోలియం లిమిటెడ్‌ (ఆర్‌పీఎల్‌) షేర్లలో అవకతవకల ట్రేడింగ్‌ వివాదం విషయంలో  రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ, మరో రెండు సంస్థలపై సెబీ విధించిన జరిమానాను సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌– శాట్‌ సోమవారం తోసిపుచి్చంది. 2007లో ఒకప్పటి  రిలయన్స్‌ పెట్రోలియం లిమిటెడ్‌ షేర్లలో అవకతవకల ట్రేడింగ్‌కు పాల్పడినట్లు వచి్చన ఆరోపణలపై ఈ తాజా పరిణామం చోటుచేసుకుంది.

సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సే్ఛంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా– సెబీ జనవరి 2021లో జారీ చేసిన ఉత్తర్వుపై ట్రిబ్యునల్‌లో దాఖలైన అప్పీల్‌లో 87 పేజీల ఈ  తాజా తీర్పు వెలువడింది. ఈ కేసులో సెబీ  జనవరి 2021 కీలక రూలింగ్‌ ఇస్తూ, ఆర్‌ఐఎల్‌పై రూ. 25 కోట్లు, కంపెనీ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అంబానీపై రూ. 15 కోట్లు, నవీ ముంబై సెజ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై రూ. 20 కోట్లు, ముంబై సెజ్‌పై రూ. 10 కోట్లు జరిమానా విధించింది. నవీ ముంబై సెజ్, ముంబై సెజ్‌ రెండింటినీ ఒకప్పుడు రిలయన్స్‌ గ్రూప్‌లో పనిచేసిన ఆనంద్‌ జైన్‌  ప్రమోట్‌ చేశారు. ఒకవేళ రెగ్యులేటర్‌ వద్ద జరిమానాను డిపాజిట్‌ చేసినట్లయితే ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలని కూడా సెబీని ట్రిబ్యునల్‌ ఆదేశించింది.  

ఆర్‌ఐఎల్‌కు లభించని ఊరట..
అయితే ఈ కేసు విషయంలో ఆర్‌ఐఎల్‌ వేసిన అప్పీల్‌ను శాట్‌ తోసిపుచి్చంది. కంపెనీ విషయంలో సెబీ ఉత్తర్వు్యలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏదీ లేదని భావిస్తున్నట్లు పేర్కొంది. జస్టిస్‌ తరుణ్‌ అగర్వాలా, ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ మీరా స్వరూప్‌లతో కూడిన ధర్మాసనం కంపెనీ అప్పీల్‌ను తోసిపుచ్చుతూ,  ‘కంపెనీ ఆర్‌ఐఎల్‌కు సంబంధించినంతవరకు సెబీ ఆర్డర్‌లో జోక్యం చేసుకోవడానికి మాకు ఎటువంటి కారణం లేదు‘ అని స్పష్టం చేసింది.

నవంబర్‌ 2007లో నగదు– ఫ్యూచర్స్‌ సెగ్మెంట్లలో ఆర్‌పీఎల్‌ షేర్ల అమ్మకం–కొనుగోలుకు సంబంధించిన కేసు ఇది. 2009లో ఆర్‌ఐఎల్‌తో ఆర్‌పీఎల్‌ విలీనమైంది. అంతక్రితం 2007 మార్చిలో ఆర్‌ఐఎల్‌ ఒక కీలక నిర్ణయం తీసుకుంటూ... ఆర్‌పీఎల్‌లో దాదాపు 5 శాతం వాటాను విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. అటు తర్వాత నవంబర్‌ 2007లో నగదు– ఫ్యూచర్స్‌ సెగ్మెంట్లలో ఆర్‌పీఎల్‌ షేర్ల అమ్మకం–కొనుగోలు విషయంలో అక్రమాలు జరిగాయన్నది ఆరోపణ. 

2007 నవంబర్‌లో ఆర్‌పీఎల్‌ ఫ్యూచర్స్‌లో లావాదేవీలు చేపట్టేందుకు ఆర్‌ఐఎల్‌ 12 మంది ఏజెంట్లను నియమించిందని సెబీ తన జనవరి 2021 ఆర్డర్‌లో పేర్కొంది. ఈ 12 మంది ఏజెంట్లు కంపెనీ తరపున ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ (ఎఫ్‌అండ్‌ఓ) సెగ్మెంట్‌లో షార్ట్‌ పొజిషన్లు తీసుకున్నారని,  అయితే కంపెనీ (ఆర్‌ఐఎల్‌) నగదు విభాగంలో ఆర్‌పీఎల్‌ షేర్లలో లావాదేవీలు చేపట్టిందని పేర్కొంది. 

నగదు, ఎఫ్‌అండ్‌ఓ లావాదేవీలు రెండింటిలోనూ ఆర్‌పీఎల్‌ షేర్లను విక్రయించడం ద్వారా అనవసరమైన లాభాలను ఆర్జించడానికి తాను నియమించిన ఏజెంట్లతో ఆర్‌ఐఎల్‌ ప్రణాళికాబద్ధమైన ఆపరేషన్‌లోకి ప్రవేశించిందని వివరించింది. ఇది  పీఎఫ్‌యూటీపీ (మోసపూరిత– అన్యాయమైన వాణిజ్య పద్ధతుల నిషేధం)  నిబంధనలను ఉల్లంఘించడమేనని సెబీ తన ఉత్తర్వు్యల్లో పేర్కొంది. 12 సంస్థలకు నిధులు సమకూర్చడం ద్వారా మొత్తం మానిప్యులేషన్‌ స్కీమ్‌కు నవీ ముంబై సెజ్, ముంబై సెజ్‌  నిధులు సమకూర్చాయని పేర్కొంది. అయితే  ఈ వ్యవహారంలో ముకేశ్‌ అంబానీ, రెండు కంపెనీల పాత్రపై తగిన ఆధారాలు లేవని శాట్‌ బెంచ్‌ అభిప్రాయపడింది.   

>
మరిన్ని వార్తలు