రెండు రోజులు బ్యాంకుల సమ్మె.. ఎస్‌బీఐ రిక్వెస్ట్‌

14 Dec, 2021 07:58 IST|Sakshi

SBI Statement On Two Days Bank Strike: పబ్లిక్‌ సెక్టార్‌లోని రెండు బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ United Forum of Bank Unions (UFBU) డిసెంబర్‌ 16, 17 తేదీల్లో బ్యాంకుల సమ్మెకు పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ రెండు రోజులపాటు కార్యకలాపాలన్నీ ఆగిపోతాయని, సేవలు నిలిచిపోతాయని బ్యాంకులు కస్టమర్లకు అలర్ట్‌ సైతం జారీ చేశాయి. ఈ తరుణంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఒక ప్రకటన విడుదల చేసింది. 


ఈ సమ్మెకు దూరం ఉండాలని తమ ఉద్యోగులకు విజ్ఞప్తి చేసింది ఎస్‌బీఐ. సమ్మెలో పాల్గొనడంపై పునరాలోచించుకోవాలని,  తద్వారా లావాదేవీలకు, ఇతర సేవలకు విఘాతం కలగకుండా చూడాలని కోరింది. ‘కరోనా సమయంలో సమ్మెల వల్ల సేవలకు విఘాతం కలుగుతుంది. ఈ స్ట్రయిక్‌ పట్ల బ్యాంక్‌, ఇన్వెస్టర్లు, ఖాతాదారులకు ఎలాంటి ఆసక్తి ఉండబోదు. ఈ రెండు రోజులపాటు బ్యాంకులు సాధారణంగానే పని చేస్తాయని, అయితే కస్టమర్లకు అందించే సేవలపై సమ్మె ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి అని ప్రకటనలో పేర్కొంది ఎస్‌బీఐ.  

ఈ నేపథ్యంలో కస్టమర్లను వీలైనంత మేర డిజిటల్‌ ట్రాన్‌జాక్షన్స్‌ వైపు మొగ్గు చూపాలని కోరింది స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా. అంతేకాదు ఈ రెండు రోజులపాటు అత్యవసరమైతేనే బ్యాంకులకు రావాలని కస్టమర్లకు సూచించింది.  అయితే ఏటీఎంలలో క్యాష్‌ పరిస్థితి గురించి ఎలాంటి స్టేట్‌మెంట్‌ ఇవ్వలేదు.  ఇదిలా ఉంటే ప్రైవేటీకరణ వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ రెండు బ్యాంకుల ప్రైవేటీకరణపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఆర్థికశాఖ నిర్మలాసీతారామన్‌ తెలిపారు. లోక్‌సభలో ఆమె ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. 

చదవండి: బ్యాంకులపై ‘బెయిల్‌ అవుట్‌’ భారం!

మరిన్ని వార్తలు