ఎస్‌బీఐ కొత్త సర్క్యులర్‌.. ఒక్క నోటీసుతో సీన్‌ రివర్స్‌, వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటన

29 Jan, 2022 17:27 IST|Sakshi

ఉమెన్‌ కమిషన్‌ నోటీసుల దెబ్బకు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ‘స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’ దిగొచ్చింది. గర్భిణీ ఉద్యోగుల విషయంలో కొత్తగా జారీ చేసిన వివాదాస్పద సర్క్యులర్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆఘమేఘాల మీద ప్రకటించింది. 

ప్రెగ్నెంట్‌ ఉమెన్‌ క్యాండిడేట్స్‌ల విషయంలో..  మూడు నెలలు దాటిన గర్భిణి అభ్యర్థులు విధుల్లో చేరడానికి తాతాల్కికంగా అనర్హులంటూ స్టేట్‌ బ్యాంక్‌ ఇండియా సర్క్యులర్‌ జారీ చేయడం, ఆపై విమర్శలు చెలరేగడం తెలిసిందే. పైగా బిడ్డకు జన్మనిచ్చిన నాలుగు నెలలలోపు చేరొచ్చంటూ పోయినేడాది డిసెంబర్‌ 31న రిలీజ్‌ చేసిన ఆ సర్క్యులర్‌లో పేర్కొంది. 

అయితే ఈ చర్య వివక్షతో కూడుకున్నదని, రాజ్యంగబద్ధమైన ప్రాథమిక హక్కుల్ని కాలరాసేదిగా ఉందని,  పైగా కోడ్‌ ఆఫ్‌ సోషల్‌ సెక్యూరిటీ 2020 ప్రకారం చెల్లదని అని పేర్కొంటూ ఢిల్లీ ఉమెన్స్‌ కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. మరోవైపు రాజ్యసభ సభ్యుడు బినోయ్ విశ్వమ్ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు ఈ విషయమై లేఖ కూడా రాశారు.

ఈ నేపథ్యంలో ఎస్బీఐ వెనక్కి తగ్గింది. SBI మునుపటి నిబంధనల ప్రకారం, గర్భిణీ స్త్రీల అభ్యర్థులు గర్భం దాల్చిన ఆరు నెలల వరకు బ్యాంకులో నియమించబడటానికి అర్హులు. దానిని మారుస్తూ బ్యాంక్‌ సర్క్యులర్‌ తేవడడమే తాజా విమర్శలకు కారణమైంది. ఇక సర్క్యులర్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు బ్యాంక్‌ ప్రకటించినప్పటికీ.. బ్యాంక్‌ చైర్మన్‌ ఉమెన్‌ కమిషన్‌ ముందు ఎస్బీఐ చైర్మన్‌ దినేశ్‌ కుమార్‌ ఖారా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు