Tax free Gold: రూ.37 వేలకే తులం బంగారం! ఇలా చేస్తే మీ సొంతం

8 Mar, 2023 21:54 IST|Sakshi

భారతీయులకు బంగారం అంటే అత్యంత ప్రీతి. దాన్ని ఒక పెట్టుబడి సాధనంగా కూడా చూస్తారు. ముఖ్యంగా మహిళలయితే బంగారం ఆభరణాలు ధరించడానికి ఇష్టపడతారు. ఈ నేపథ్యంలో రోజూ బంగారం ధరలు ఎలా ఉన్నాయో గమనిస్తూ ఉంటారు.

ఇదీ చదవండి: Currency Notes: రద్దయిన పాత నోట్లను మార్చుకోవచ్చా..? కేంద్రం కీలక ప్రకటన! 

దేశంలో బంగారం 90 శాతం దిగుమతుల ద్వారానే సమకూరుతోంది. 2022 ఏడాదిలో విదేశాల నుంచి దాదాపు 706 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది భారత్. ఇందుకోసం దాదాపు 36.6 బిలియన్ డాలర్లు వెచ్చించింది. బంగారంపై భారతీయులకు ఉన్న ఆసక్తిని గ్రహించిన భూటాన్.. భారతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఫుయంషోలింగ్, థింపులకు వచ్చేవారు ఎలాంటి ట్యాక్స్ లేకుండానే బంగారం కొనుగోలు చేసేందుకు అనుమతిస్తోంది. దీంతో భారత్‌లో కంటే తక్కువ ధరకే అక్కడ బంగారం కొనుక్కోవచ్చు.

ఇదీ చదవండి: Ola Holi Offer: తక్కువ ధరకు ఓలా స్కూటర్లు.. రూ.45,000 వరకు తగ్గింపు!

భూటాన్ దేశ నూతన సంవత్సరం, భూటాన్ రాజు జన్మదినాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 21న ఆ దేశ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా తమ పర్యాటక ఆదాయాన్ని పెంచుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు భూటాన్ అధికారిక పత్రిక డైలీ కౌన్సెల్ ప్రచురించింది. భారత్‌తో పోలిస్తే ధరలు కాస్త తక్కువగా ఉండటంతో ప్రస్తుతం చాలా మంది భారతీయులు దుబాయ్ వెళ్లి బంగారం కొంటున్నారు.

తులం బంగారం రూ.37 వేలే..
ప్రస్తుతం ఉన్న ధర ప్రకారం భారత్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.55,600పైగానే ఉంది. అదే భూటాన్‌‍లో 10 గ్రాముల బంగారం 37,588.49 భూటనీస్ ఎన్‌గూల్ట్రమ్ (బీటీఎన్)గా ఉంది. ఒక బీటీఎన్  భారత రూపాయితో దాదాపు సమానంగా ఉంది. అంటే భారతీయులు రూ.37,588కే తులం బంగారం కొనుక్కోవచ్చన్న మాట.

మరి షరతులు?
భూటన్‌లో భారతీయులు పన్ను రహిత బంగారం కొనుగోలు చేయాలంటే సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ ఫీ (ఎస్‌డీఎఫ్) రూ.1,200 నుంచి రూ.1,800 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఆ దేశ ప్రభుత్వం గుర్తింపు పొందిన టూరిస్ట్ సెర్టిఫైడ్ హోటల్‌లో ఒక రాత్రి బస చేయాల్సి ఉంటుంది. టూరిస్టులు అమెరికా డాలర్లతోనూ బంగారం కొనుగోలు చేయొచ్చు.

ఈ ఎస్‌డీఎఫ్ టూరిజం ట్యాక్స్‌ను 2022లోనే భూటాన్ ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. దీని ప్రకారం.. భారతీయులు ఒక వ్యక్తి.. ఒక రోజుకు రూ.1,200 నుంచి రూ.1,800 చెల్లించాలి. ఇతర దేశస్థులయితే 65 నుంచి 200 డాలర్ల వరకు చెల్లించాలి. ఈ ఎస్‌డీఎఫ్ ట్యాక్స్ కట్టిన వారు మాత్రమే ఈ ట్యాక్స్ ఫ్రీ గోల్డ్ కొనేందుకు అర్హులు. ఈ బంగారాన్ని లగ్జరీ వస్తువులు విక్రయించేడ్యూటీ ఫ్రీ ఔట్‌లెట్స్‌లో కొనుగోలు చేయొచ్చు.

ఎంత బంగారం తెచ్చుకోవచ్చు?
కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు, కస్టమ్స్ విభాగం నిబంధనల ప్రకారం విదేశాల నుంచి భారత్‌లోకి మగవారైతే రూ.50 వేల విలువైన బంగారం, మహిళలయితే గరిష్టంగా రూ.లక్ష విలువైన బంగారం తెచ్చుకోవచ్చు. అంతకు మించి తీసుకువస్తే కస్టమ్స్ సుంకాలు చెల్లించాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి: Women’s Day 2023: ఈ బ్యాంకును నడిపించేది ఆమే.. ఏకైక మహిళా చీఫ్‌!

మరిన్ని వార్తలు