క్రిప్టో కరెన్సీపై టీడీఎస్, సీబీడీటీ ఏం చెప్పిందంటే!

29 Jun, 2022 10:05 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇద్దరు వ్యక్తుల మధ్య (పీర్‌ టు పీర్‌/పీటూపీ) నడిచే క్రిప్టో లావాదేవీలలో టీడీఎస్‌ మినహాయించి, ఆదాయపన్ను శాఖకు జమ చేయాల్సిన బాధ్యత కొనుగోలుదారులపై ఉంటుంది. ఆదాయపన్ను శాఖకు చెందిన ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) క్రిప్టో పన్నులపై ఈ మేరకు మరోసారి స్పష్టత ఇచ్చింది. 

సెక్షన్‌ 194 ఎస్‌ కింద.. పీర్‌టుపీర్‌ లావాదేవీల్లో వర్చువల్‌ డిజిటల్‌ అస్సెట్‌ (వీడీఏ/క్రిప్టోలు,ఎన్‌ఎఫ్‌టీలు) కొనుగోలు చేసే వారు టీడీఎస్‌ను మినహాయించి, మిగిలిన మొత్తాన్నే విక్రయదారుకు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. పీర్‌టూపీర్‌ అంటే ఎక్సే్ఛంజ్‌ ప్రమేయం లేకుండా వ్యక్తులు చేసుకునే లావాదేవీలు. ఎక్సే్ఛంజ్‌ల్లో అయితే ఆయా ప్లాట్‌ఫామ్‌లు క్లయింట్ల తరఫున టీడీఎస్‌ మినహాయిస్తాయి. 

ఒకవేళ వీడీఏలను ఇద్దరు వ్యక్తులు మార్పిడి చేసుకుంటే (ఒకరి వద్దనున్న డిజిటల్‌ అసెట్స్‌ను అవతలి వ్యక్తికి ఇచ్చి, అవతలి వ్యక్తి వద్దనున్న వేరే వీడీఏలను తీసుకోవడం) అప్పుడు ఇద్దరు సైతం కొనుగోలుదారులు, విక్రయదారుల కిందకు వస్తారని సీబీడీటీ తెలిపింది. అప్పుడు ఇద్దరూ టీడీఎస్‌ను చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. దీంతో టీడీఎస్‌ బాధ్యతను కొనుగోలుదారుపై పెట్టినట్టయింది. క్రిప్టోల లావాదేవీలపై ఒక శాతం టీడీఎస్‌ నిబంధన 2022 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రావడం తెలిసిందే.

మరిన్ని వార్తలు