యూఏఈ కొత్త​ చట్టం.. ఇక కుటుంబాల ఆధిపత్యానికి చెక్‌!

27 Dec, 2021 15:33 IST|Sakshi

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ సంచలన నిర్ణయం తీసుకుందని సమాచారం. దశాబ్దాలుగా సాగుతున్న ‘కుటుంబాల వ్యాపార’ ఆధిపత్యానికి చెక్‌ పెట్టేలా కొత్త చట్టం తీసుకురాబోతోంది. ఒకవేళ చట్టం విదేశీ కంపెనీలు నేరుగా అక్కడ వ్యాపారలావాదేవీలు నిర్వహించుకునే అవకాశం కలగనుంది. 


ఫైనాన్షియల్‌ టైమ్స్‌ కథనం ప్రకారం.. యూఏఈలో చాలాఏళ్లుగా కొన్ని కుటుంబాల చేతుల్లోనే వ్యాపార సామ్రాజ్యం నడుస్తోంది. కమర్షియల్‌ ఏజెన్సీ అగ్రిమెంట్‌ల సాయంతో విదేశీ కంపెనీలన్నింటిని ఈ కుటుంబాలే నడిపిస్తూ వస్తాయి . అయితే ఆ అగ్రిమెంట్‌ల ఆటోమేటిక్‌ రెన్యువల్‌కు పుల్‌స్టాప్‌ పెట్టేలా యూఏఈ ప్రభుత్వం కొత్త చట్టం తేనుంది. ఇప్పటికే చట్ట రూపకల్పన జరిగిపోయిందని, ఎమిరేట్స్‌ నాయకత్వం దానిని ఆమోదం తెలపడం మాత్రమే మిగిలిందని ఆ కథనం వెల్లడించింది. అయితే ఎప్పటిలోపు ఆ చట్టం తీసుకురాబోతున్నారన్న విషయంపై మాత్రం స్పష్టత కొరవడింది. 

ఇదిలా ఉంటే ఈ గల్ఫ్‌ దేశంలో ఎక్కువ శాతం వ్యాపారాలు, ఇతర కమర్షియల్‌ యాక్టివిటీస్‌ కూడా కొన్ని కుటుంబాల చేతుల్లోనే నడుస్తున్నాయి. హోటల్‌ ఫ్రాంచైజీల దగ్గరి నుంచి కార్‌ డీలర్‌షిప్‌ల దాకా ప్రతీది కొన్ని కుటుంబాలే నడిపిస్తున్నాయి. ఒకవేళ తాజా చట్టం గనుక అమలులోకి వస్తే మాత్రం.. విదేశీ కంపెనీలకు ఊరట కలగనుంది. అయితే ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసే యోచనలో ఉన్నాయి కొన్ని కుటుంబాలు.

చదవండి: వీకెండ్‌ సెలవుల్ని మార్చేసిన యూఏఈ. ఎప్పుడో తెలుసా?  

మరిన్ని వార్తలు