చైనా నుంచి తెస్తామంటే ఒప్పుకోం ఎలన్‌మస్క్‌ - నితిన్‌ గడ్కారీ

26 Apr, 2022 17:58 IST|Sakshi

టెస్లా కార్ల విషయంలో భారత ప్రభుత్వ వైఖరిని మరోసారి స్పష్టం చేశారు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కారీ. ఎన్నిసార్లు చెప్పినా, ఎ‍ప్పుడు చెప్పినా టెస్లా ఎలక్ట్రిక్‌ కార్ల విషయంలో తమది ఒకే విధానమంటూ కుండ బద్దలు కొట్టారు. ఇండియా మార్కెట్‌లో ఎంట్రీ ఇవ్వాలంటే లాబీయింగ్‌ వ్యవహారం పనికి రాదని ఎలన్‌మస్క్‌కు తేల్చి చెప్పారు.

కేంద్ర విదేశాంగ శాఖ ఈ రోజు నిర్వహించిన ది రైసినా డైలాగ్‌ 2022లో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కారీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టెస్లా కార్ల అంశంపై ఆయన మాట్లాడుతూ.. టెస్లా కంపెనీ ఇండియాలో మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ పెట్టుకుని ఇక్కడ తయారు చేసిన కార్లను దేశంలో అమ్మడంతో పాటు విదేశాలకు ఎగుమతి చేసుకోవచ​‍్చని సూచించారు. అంతేకాని చైనాలో తయారు చేసిన కార్లను ఇండియాలో అమ్ముతాం. వాటికి పన్నులు తగ్గించాలంటే మాత్రం అంగీకరించబోమని వెల్లడించారు.

ప్రపంచంలోనే పెద్ద మార్కెట్‌ అయిన ఇండియాలో టెస్లా కార్లను ప్రవేశపెట్టాలని ఎలన్‌మస్క్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాలుష్య రహితమైన టెస్లా కార్లకు దిగుమతి సుంకాలు రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాడు. ఈ మేరకు ఢిల్లీలో భారీ ఎత్తున లాబీయింగ్‌ ప్రక్రియ జరుగుతోంది. అయితే ఇండియాలో తయారీ యూనిట్‌ పెడితే పన్నుల తగ్గింపు అంశాన్ని పరిశీలిస్తామని కేంద్రం ఏనాడో ప్రకటించింది. సమయం గడుస్తున్నా ఇండియా అదే విధానానికి కట్టుబడి ఉందని తాజా ప్రకటనతో మరోసారి రుజువైంది. 

చదవండి: వరుస ప్రమాదాలు.. ఎలక్ట్రిక్ వాహనాల భవితవ్యంపై గడ్కరీ కీలక ప్రకటన

మరిన్ని వార్తలు