క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న 12 మంది అరెస్ట్‌

8 Oct, 2021 03:55 IST|Sakshi
నిందితులతో పోలీసులు

రూ.2,29,700తో పాటు కర్ణాటక మద్యం స్వాధీనం 

వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు పోలీసుల దాడులు 

ప్రొద్దుటూరు క్రైం: వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న 12 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి రూ.2,29,700తో పాటు, కర్ణాటక మద్యం ప్యాకెట్లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ ప్రసాద్‌రావు గురువారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు జరుగుతుండటంతో బెట్టింగ్‌ నిర్వహించే ప్రాంతాలు, నిర్వాహకుల కదిలికలపై పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో ప్రొద్దుటూరులోని ఆర్టీపీపీ రోడ్డు, రామేశ్వరం నీళ్ల ట్యాంకు ఆవరణలో పందేలు నిర్వహిస్తున్నారని సమాచారం రావడంతో వన్‌టౌన్‌ సీఐ నాగరాజు, ఏఎస్‌ఐ ఇబ్రహీంలు సిబ్బందితో కలిసి గురువారం దాడులు నిర్వహించి బెట్టింగ్‌ రాయుళ్లను అరెస్ట్‌ చేశారు.

అరెస్ట్‌ అయిన వారిలో మల్లెల వెంకటనారాయణరెడ్డి, కరుమూరు యుగంధర్, అచ్చుకట్ల జిలాన్‌బాషా, తులబండి బాలసుబ్రహ్మణ్యం, మోపూరి శ్రీధర్, బైసాని సుధాకర్, ధర్మవరం దస్తగిరి, పాలెం ఇమాంషా, వెంకటసుబ్బయ్య, శ్రీధర్‌కుమార్, వెంకటసుదర్శన్‌రెడ్డి, మైనగారి నాగేంద్రప్రసాద్‌ ఉన్నారు. వారి వద్ద నుంచి నగదుతో పాటు 4 సెల్‌ఫోన్లు, 6 కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లు, బెట్టింగ్‌ స్లిప్పులను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్టు డీఎస్పీ ప్రసాద్‌రావు వివరించారు.   

మరిన్ని వార్తలు