‘ప్రేమ పేరుతో మోసం.. జీవితంలో మర్చిపోలేని బాధనిచ్చాను’

23 May, 2023 17:47 IST|Sakshi

ప్రేమ పేరుతో ఆకతాయిల చేష్టలు ఎక్కువైపోతున్నాయి. అమ్మాయి ఒప్పుకోలేదని, దక్కలేదనే కక్షతో దాడులకు పాల్పడుతున్నారు. చివరకు ప్రాణాలు సైతం తీసేందుకు వెనకాడడం లేదు. ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఒకచోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమించి, తనను దూరం పెట్టిందన్న కక్షతో యువతి ఇంట్లో కాల్పులకు తెగబడ్డాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన షాజపూర్‌ జిల్లాలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. 

వివరాలు.. 25 ఏళ్ల సుభాష్ ఖరాడి దేవాస్‌ నగరంలో పోలీస్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అదే సమయంలో శివాని అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఇద్దరు ప్రేమించుకున్నారు. వీరి పెళ్లికి యువతి ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో అతడిని ఆమె దూరం పెట్టింది. అప్పటి నుంచి శివాని, ఆమె కుటుంబ సభ్యులపై సుభాష్‌ కక్ష పెంచుకున్నాడు.
చదవండి: అతి త్వరలోనే ముంబైని పేల్చేస్తాం.. పోలీసులకు బెదిరింపులు

ఈ క్రమంలో ఆదివారం రాత్రి మలిఖేడి గ్రామంలోని యువతి తండ్రి జాకీర్‌ ఖాన్‌ ఇంట్లోకి కంట్రీమేడ్‌ పిస్టోల్‌తో చొరబడ్డాడు. ఇంట్లో శివానీ ,ఆమె తండ్రి, సోదరుడిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దాడిలో తండ్రి జాకీర్‌ అక్కడికక్కడే మరణించగా.. యువతి, ఆమె సోదరుడు ఇండోర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందున్నారు. అయితే శివాని పరిస్థితి విషయమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

కాల్పుల అనంతరం ఖరాడీ తన ఫేస్‌బుక్‌లో యువతితో కలిసి దిగిన ఫోటోతో పోస్టు పెట్టారు. ‘ ప్రేమ పేరుతో  నాకు ద్రోహం చేసింది. అందుకే ఆమెను చంపాను. జీవితంలో తనకు మర్చిపోలేని బాధను ఇచ్చాను’ అని పోస్టులో పేర్కొన్నాడు. అయితే కొన్ని గంటలకే అతడి మృతదేహం రైల్వే ట్రాక్‌పై కనిపించింది. కదులుతున్న రైలు నుంచి కిందకు దూకండంతో అతడు మరణించి ఉంటాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని జిల్లా పోలీసు చీఫ్ యశ్‌పాల్ సింగ్ రాజ్‌పుత్ తెలిపారు. 

మరిన్ని వార్తలు