పోలీస్‌ వాహనం ఢీకొని బాలుడి మృతి 

1 Oct, 2020 05:13 IST|Sakshi
హర్షవర్ధన్‌ (ఫైల్‌)

హైదరాబాద్‌: ప్రమాదవశాత్తు పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనం ఢీకొని ఆరేళ్ల బాలుడు దుర్మరణం చెందాడు. ఈ వి షాద ఘటన హైదరాబాద్‌ మంగళహాట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. మంగళహాట్‌ గుఫ్పా నగర్‌ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్‌ వృత్తిరీత్యా మెకానిక్‌. ఆయన భార్య రేణుక. వీరికి ముగ్గురు కుమారులు సంతానం. రెండో కుమారుడు హర్షవర్ధన్‌ బుధవారం మధ్యాహ్నం షాపు వద్ద భోజనం తిని ప్లేటు కడుగుతున్నాడు.

అదే సమయంలో పోలీసు పెట్రోలింగ్‌ వాహనం టైర్లల్లో గాలి నింపించేందుకు వచ్చింది. అందులో డ్రైవర్‌ భగవంత్‌రెడ్డితోపాటు మరో కానిస్టేబుల్‌ ఉన్నాడు. వాహనాన్ని వెనక్కు తీసే క్రమంలో డ్రైవర్‌ బాలుడిపైకి ఎక్కించేశాడు. అక్కడి వారు కేకలు వేయడంతో డ్రైవర్‌ వాహనాన్ని నిలిపేశాడు. స్థానికుల సాయంతో వాహనాన్ని పైకి ఎత్తి బాలుడిని తీసి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. 

>
మరిన్ని వార్తలు