తండ్రి ఉసురు తీసిన ‘తనయుడి ప్రేమ’

5 Jun, 2022 02:16 IST|Sakshi
మాధమోని కృష్ణయ్య (ఫైల్‌) 

డిండి: కుమారుడి ప్రేమ వ్యవహారం తండ్రి ఆత్మహత్యకు దారితీసింది. నల్లగొండ జిల్లా డిండికి చెందిన మాధమోని కృష్ణయ్య(38), సైదమ్మ దంప తులకు కుమారుడు సాయి, ఇద్దరు కుమార్తెలు. సాయి చేపలవేట సాగిస్తూ  ఆర్నెల్లుగా తల్లిదం డ్రులకు దూరంగా నాయనమ్మతో కలిసి ఉంటు న్నాడు. సాయి అదే గ్రామానికి చెందిన ఇంటర్‌ చదువుతోన్న బాలికను మూడేళ్లుగా ప్రేమిస్తు న్నాడు.

కాగా, సదరు బాలికకు ఇంట్లో పెళ్లి సం బంధాలు చూస్తుండటంతో ఏప్రిల్‌ చివరి వారంలో సాయి, బాలిక కలిసి శ్రీశైలం పారిపోయారు. ఇరు కుటుంబాల సభ్యులు వారిద్దరినీ డిండికి తీసుకొచ్చి కుల పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి.. ఇలాంటిది పునరావృతం కావొద్దని సర్ది చెప్పారు.

మళ్లీ పారిపోయారు..
బాలికకు మే 3న నిశ్చితార్థం చేయాలని ఆమె కుటుంబ సభ్యులు నిర్ణయించారు. దీంతో సాయి, సదరు బాలిక మే 2న రాత్రి మళ్లీ ఇంట్లో నుంచి పారిపోయారు. దీంతో సాయిపై బాలిక తల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేపట్టారు. సాయి, సదరు బాలిక తమ సెల్‌ఫోన్‌లు ఇంట్లోనే వదిలి వెళ్లడంతో వారిని గుర్తించటం పోలీ సులకు కష్టంగా మారింది. ఫిర్యాదు చేసి నెలరోజులు దాటినా తమ కుమార్తె ఆచూకీ కనిపెట్టడం లేదని బాలిక తల్లి తన బంధువులతో కలిసి పోలీసులపై ఒత్తిడి తెచ్చింది. ఈ క్రమంలో కృష్ణయ్య, సైదమ్మ దంపతులను ప్రతీరోజు స్టేషన్‌కు పిలిపించి తమ కొడుకు ఆచూకీ చెప్పాలని పోలీసులు ఒత్తిడి తీసుకొచ్చారు. 

ఒత్తిడి తట్టుకోలేక..
ఒకవైపు తన కొడుకు జాడ తెలియక, మరోవైపు బాలిక తల్లి, బంధువుల సూటిపోటిమాటలు, పోలీ సుల ఒత్తిడి తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన కృష్ణయ్య శనివారం ఇంట్లో పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి కృష్ణయ్య ను నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కృష్ణయ్య మృతితో ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు, బంధువులు బాలిక తల్లిపై, వారి ఇంటిపై దాడికి పాల్పడ్డారు.

బాలిక తల్లి, బంధువుల వేధింపులతో పాటు పోలీసుల ఒత్తిడి కారణంగానే కృష్ణయ్య ఆత్మహత్య చేసుకున్నాడని పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ధర్నా చేపట్టారు. అయితే సాయి ఆచూకీ తెలిస్తే తమకు చెప్పాలని మాత్రమే కృష్ణయ్య, సైదమ్మ దంపతులను పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించామని పోలీసులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు