ప్రైవేటు ఆసుపత్రి నిర్వాకం: డాక్టర్ల నిర్లక్ష్యంతోనే..

29 Jul, 2021 08:01 IST|Sakshi

సాక్షి, మంచిర్యాల: డాక్టర్‌ నిర్లక్ష్యంతో వృద్ధురాలు మృతిచెందిన సంఘటన జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్సై ప్రవీణ్‌ కుమార్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో గోదావరిఖనికి చెందిన కడారి అయిలమ్మ(65)ను అనారోగ్యం కారణంగా కుటుంబ సభ్యులు ఈనెల27న చేర్పించారు. నాలుగు రోజులుగా కొంత అనారోగ్యంతో బాధపడుతుండగా చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకురాగా పరీక్షించిన వైద్యులు ఎలాంటి ప్రాణాపాయం లేదని కొంత చికిత్స అవసరమని అడ్మిట్‌ చేసుకున్నారు.

బుధవారం ఉదయం, సాయంత్రం వరకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పిన ఆసుపత్రి వైద్యుడు రాత్రి మాత్రం ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోయాయని పేర్కొన్నాడు. ఆసుపత్రిలో ఆక్సిజన్‌ అందుబాటులో లేకపోవడంతో అయిలమ్మ కుటుంబ సభ్యులు వేరే చోట నుంచి సిలిండర్‌ తీసుకొచ్చారు. అయితే ఆక్సీమీటర్‌తో పాటు సిలిండర్‌ బిగించడానికి స్పానర్‌ కూడా ఆసుపత్రిలో లేవు. పరిస్థితి విషమించిన అయిలమ్మకు చికిత్స చేసేందుకు డాక్టర్‌ రాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే అయిలమ్మ మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.  

మరిన్ని వార్తలు