Tamil Nadu Crime: యువకుడి మృతి కేసులో కీలక మలుపు.. ప్రియురాలి విషయంలో జరిగిన వాగ్వాదంతో

23 Aug, 2022 15:30 IST|Sakshi
మృతి చెందిన అర్జున్‌, నిందితుడు దినేష్‌ (ఫైల్‌)  

సాక్షి, చెన్నై: ప్రియురాలి విషయంలో జరిగిన వాగ్వాదంలో స్నేహితుడిని హతమార్చిన నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా తిరునిండ్రవూర్‌ రైల్వే స్టేషన్‌కు సమీపంలో గత జూలై12న ట్రాక్‌పై యువకుడి మృతదేహం లభించింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి విచారణ చేపట్టారు.

విచారణలో మృతుడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తిరుపతి బాలాజీ జిల్లా పిచ్చాటూరు గ్రామానికి చెందిన అర్జున్‌గా గుర్తించారు. మొదట ఆత్మహత్యగా భావించిన పోలీసులు సాధారణ విచారణ చేపట్టారు. అయితే పోస్టుమార్టం నివేదికలో యువకుడిని కొట్టి హత్య చేసినట్టు నిర్ధారణ కావడంతో దర్యాప్తును ముమ్మరం చేశారు. అర్జున్‌ చివరి సారిగా ఫోన్‌లో మాట్లాడిన తిరునిండ్రవూర్‌కు చెందిన దినేష్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విచారణలో దినేష్, అర్జున్‌ ఒకే చోట పని చేస్తున్నట్లు గుర్తించారు.

వీరిద్దరికి తిరువళ్లూరు జిల్లా పాక్కంలోని స్వచ్ఛంద సంస్థలో పని చేసే యువతులతో ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్టు నిర్ధారించారు. ఘటన జరిగిన రోజు తిరునిండ్రవూర్‌కు సమీపంలో ఇద్దరు కలిసి మద్యం సేవించారు. ఆ సమయంలో దినేష్‌ ప్రియురాలి గురించి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇందులో దినేష్‌ చేతిలో అర్జున్‌ హత్యకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు. 
చదవండి: చదువుకోవడం ఇష్టం లేక... మర్డర్‌ ప్లాన్‌ చేసిన విద్యార్థి!

>
మరిన్ని వార్తలు