దొంగతనం కోసం వచ్చి ఆత్మహత్య..

23 Oct, 2022 09:06 IST|Sakshi

కృష్ణరాజపురం: ఇంటిలో ఎవరూ లేని సమయం చూసి చోరీ చేయడానికి వచ్చిన దొంగ ఆ ఇంటిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇందిరానగర పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు... ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఇంటిలోకి చొరబడిన దిలీప్‌ బహదూరు ఇంటి మొత్తాన్ని గాలించి అనంతరం అదే ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరుసటి రోజు ఇంటికి వచ్చిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ విషయం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.    

మేడ మీద దాడి చేసి హత్య
బనశంకరి: ఓ వ్యక్తిని అతని ఇంటి మేడపైనే తీవ్రంగా కొట్టి హత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన యలహంక పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఏపీలో సత్యసాయి జిల్లాలోని  హిందూపురం నివాసి చంద్రశేఖర్‌ (33) హతుడు. యలహంక కొండప్ప లేఔట్‌లో గత 8 ఏళ్లుగా ఇక్కడ మూడంతస్తుల భవనంలో ఒక ఇంట్లో చంద్రశేఖర్‌ దంపతులు నివాసం ఉంటున్నారు. ఇతను చేనేత కార్మికునిగా పనిచేస్తున్నారు.

శుక్రవారం రాత్రి 8.45 సమయంలో ఇంటి మేడపైన గుర్తుతెలియని దుండగులు చంద్రశేఖర్‌ తల, మర్మాంగంపై దాడిచేసి ఉడాయించారు. కుటుంబసభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు పరీక్షించి మృతి చెందాడని ధృవీకరించారు. యలహంక పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి హంతకుల కోసం గాలింపు చేపట్టారు. ఆర్థిక వివాదాలు, లేదా వివాహేతర సంబంధం హత్యకు కారణం కావచ్చని అనుమానిస్తున్నారు.   

బంధువు, భార్యపై అనుమానాలు..
పోలీసుల ప్రాథమిక విచారణలో హతుని బావమరిది లోకేశ్‌పై అనుమానం వ్యక్తమైంది. లోకేశ్‌ హతుని భార్యకు బంధువు అవుతాడు. గతంలో ప్రేమించాలని ఆమె వెంటపడ్డాడు.  ఇతని వేధింపులు తాళలేక హిందూపురం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో చంద్రశేఖర్‌ దంపతులు ఫిర్యాదు చేశారు. ఈ సమయంలో పోలీస్‌స్టేషన్‌ వద్ద లోకేశ్‌ను చంద్రశేఖర్‌ భార్య చెప్పుతో దాడి చేసింది. ఈ నేపథ్యంలో హత్య లోకేశ్‌ చేశాడా అనే అనుమానం వ్యకమైందని ఆగ్నేయ విభాగ డీసీపీ అనూప్‌శెట్టి  తెలిపారు. మరోవైపు హతుని భార్యకు ఈ హత్యతో సంబంధం ఉందా? అని కూడా అనుమానం వ్యక్తమైంది. ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు డీసీపీ తెలిపారు.   

(చదవండి: వర్సిటీ మెస్‌ల నిర్వాకం.... చిప్పతో చట్నీ పోసెయ్‌)

మరిన్ని వార్తలు