హనీట్రాప్‌ కేటుగాళ్లు అరెస్ట్‌

17 Aug, 2020 06:50 IST|Sakshi
నిందితులు లక్ష్మీ,శివణ్ణ (ఫైల్‌)

కర్ణాటక,యశవంతపుర : మ్యాట్రిమోనియల్‌ ద్వారా పరిచయం చేసుకుని హనీట్రాప్‌ ఊబిలోకి లాగుతున్న మహిళతో పాటు మరో వ్యక్తిని హాసన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి వివరాల మేరకు... చిక్కబళ్లాపురకు చెందిన లక్ష్మీ (32), కోలార్‌కు చెందిన శివణ్ణలు ఆన్‌లైన్‌ మ్యాట్రిమోనియల్‌ ద్వారా ప్రజలను మోసగిస్తున్నారు. నిందితురాలు లక్ష్మీ ఆన్‌లైన్‌ మ్యాట్రిమోనియల్‌లో తాను అనాథ అని, తన పిన్ని ఇంటిలో ఉంటున్నట్లు నమ్మించేది. హాసన్‌కు చెందిన పరమేశ్‌ లక్ష్మీ ప్రొఫైల్‌ను చూసి ఆమెను కాంటాక్ట్‌ చేశాడు. ఇలా డిసెంబర్‌ 2019 నుంచి వీరి పరిచయం పెరిగింది.

ఈ క్రమంలో ఆమె వివిధ కారణాలతో పరమేశ్‌ నుంచి రూ. 6 లక్షల వరకు తీసుకుంది. క్రమంగా పరమేశ్‌ను దూరం చేయసాగింది. పరమేశ్‌ నిలదీయడంతో తనపై అత్యాచారానికి యత్నించాడని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు లక్ష్మీ, శివణ్ణలను అరెస్ట్‌ చేశారు. నిందితులు ఇద్దరు పథకం ప్రకారం అమాయకులను ట్రాప్‌లోకి లాగి మోసం చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. 

మరిన్ని వార్తలు