మహిళపై అత్యాచారం.. ఆపై వివాహం.. చివరకు...

27 Jul, 2021 10:58 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహల కారణంగా కట్టుకున్న భార్యను హింసించి.. కొండపై నుంచి తోసేసి హత్యచేశాడో ప్రబుద్ధుడు. ఈ విషాదకర సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఈ సంఘటన ఉధామ్‌సింగ్‌ నగర్‌ జిల్లాలో జరిగింది. కాగా, 24 ఏళ్ల రాజేష్‌రాయ్‌ అనే యువకుడు సెల్స్‌మెన్‌గా పనిచేసేవాడు. ఈ క్రమంలో అతడు, గతేడాది 29 ఏళ్ల బబిట అనే మహిళను అత్యాచారం చేశాడు.

దీంతో ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో.. నిందితుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. అయితే, బబిటా తనను వివాహం చేసుకుంటే.. ఫిర్యాదు వెనక్కు తీసుకుంటానని చెప్పింది. దీంతో, రాజేష్‌ రాయ్‌, బబిటను గతేడాది పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజులపాటు వీరి వివాహబంధం సాఫీగానే కొనసాగింది. కాగా, గత కొంత కాలంగా రాజేష్‌ రాయ్‌, బబిటను శారీరకంగా, మానసికంగా హింసించడం మొదలు పెట్టాడు. భార్యభర్తల మధ్య గొడవలు ఎక్కువయ్యాయి. ఈక్రమంలో, భర్త పోరు పడలేక బబిట ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో గత నెల జూన్‌ 11న రాయ్‌ పుట్టింటికి వెళ్లి తన భార్యను తెచ్చుకున్నాడు.

కొన్ని రోజుల తర్వాత బబిట ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ రావడంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. రాజేష్‌రాయ్‌ను బబిట గురించి ప్రశ్ని‍స్తే.. పొంతన లేని సమాధానాలు చెప్పాడు. దీంతో యువతి బంధువులు రాయ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు.. రాజేష్‌ రాయ్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలీలో విచారించారు. దీంతో బబిటను నైనిటల్‌ కొండపై తీసుకెళ్లి అక్కడి నుంచి తోసేసినట్లు.. రాయ్‌ పోలీసుల విచారణంలో అంగీకరించాడు. కాగా, కొండ ప్రాంతంలో బాధిత మహిళ మృతదేహం కోసం గాలింపు కొనసాగిస్తున్నామని ఉత్తరాఖండ్‌ పోలీసులు తెలిపారు. 

మరిన్ని వార్తలు