నిజామాబాద్‌: లగ్జరీ లైఫ్‌ కోసం భార్య డబ్బులు అడుగుతుందని..

12 Jan, 2022 20:07 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, సదాశివనగర్‌(నిజామాబాద్‌): విలాసవంతమైన జీవితం కోసం డబ్బులు అడుగుతుందని కట్టుకున్న భార్యనే కడతేర్చాడో ప్రబుద్ధుడు. తలపై కట్టెతో కొట్టి హతమార్చిన భర్త.. మృతదేహాన్ని పంట పొలాల్లోకి తీసుకెళ్లి కాల్చివేశాడు. పూర్తిగా కాలక పోవడంతో హత్య విషయం బయటకు వచ్చింది. రంగంలోకి దిగిన కామారెడ్డి జిల్లా పోలీసులు నిందితులను కటకటాల్లోకి పంపించారు. కామారెడ్డి ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి సదాశివగనగర్‌ పోలీసుస్టేషన్‌లో మంగళవారం కేసు వివరాలను వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లోని బల్‌రాంపూర్‌ జిల్లాకు చెందిన ఫాతిమా ఖాతూన్‌ (26), రంజాన్‌ఖాన్‌ దంపతులు ఉపాధి కోసం మేడ్చల్‌ జిల్లా గండి మైసమ్మ ప్రాంతానికి వలస వచ్చారు.


కేసు వివరాలను వెల్లడిస్తున్న ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి  

వీరికి నలుగురు పిల్లలు. కూలీ పనులు చేసుకుంటూ పొట్టపోసుకునే వారు. అయితే, ఫాతిమాకు విలాసవంతంగా బతకాలనే ఆశ ఉండేది. ఇందుకోసం డబ్బులు కావాలని భర్తను ఇబ్బంది పెడుతుండేది. ఇది మనస్సులో పెట్టుకున్న భర్త రంజాన్‌ఖాన్‌ భార్యను చంపాలని ప్లాన్‌ వేశాడు. డిసెంబర్‌ 24న ఫాతిమా తలపై దుడ్డుకర్రతో బలంగా కొట్టి హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని మాయం చేసేందుకు తన స్నేహితులు రియాజ్‌ఖాన్, పూజన్‌లతో కలిసి పథకం రచించాడు.

అదే రోజు రాత్రి 10 గంటల సమయంలో బొలెరో వాహనంలో మృతదేహాన్ని తీసుకుని కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండలం మర్కల్‌ శివారుకు చేరుకున్నారు. పంట పొలాల్లో పడేసి పెట్రోల్‌ పోసి నిప్పంటించి వెళ్లిపోయారు. అయితే, పొలాల్లోకి వెళ్లిన రైతులకు సగం కాలిన శవం కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు రెండు బృందాలుగా విడిపోయి దర్యాప్తు ప్రారంభించారు. 
చదవండి: రెండేళ్లుగా మహిళతో సహజీవనం...ఇంట్లో ఒంటరిగా ఉన్న కూతురిని బలవంతంగా...

ఒక బొలెరో వాహనం మర్కల్‌ శివారులోకి అనుమానాస్పదంగా వచ్చి తిరిగి వెళ్లినట్లు సీసీ కెమెరాల ద్వారా పోలీసులు గుర్తించారు. ఈ వాహనం కోసం భిక్కనూర్, డిచ్‌పల్లి టోల్‌గేట్ల వద్ద గల సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించగా అటువైపు వెళ్లలేదని తేలింది. దీంతో భిక్కనూరు టోల్‌గేట్‌ సీసీ టీవీ ఫుటేజీల్లో సదరు వాహనం కనిపించింది. బొలెరో రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ (టీఎస్‌ 08 యూఎఫ్‌ 5551) ఆధారంగా పోలీసులు కూపీ లాగారు. రియాజ్‌ ఖాన్‌ వాహనాన్ని తీసుకెళ్లినట్లు తేలడంతో అతడ్ని పట్టుకుని విచారించగా, రంజాన్‌ఖాన్‌ గురించి తెలి సింది. దీంతో రంజాన్‌ఖాన్‌ (ఏ1), రియాజ్‌ఖాన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మిగతా నిందితులు నన్‌బాబు, రిజ్వాన్‌ఖాన్, పూజన్‌ పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. కేసు దర్యాప్తులో ప్రతిభ చూపిన పోలీసులను సత్కరించారు. డీఎస్పీ శశాంక్‌రెడ్డి, సీఐ రామన్, ఎస్సై శేఖర్‌ పాల్గొన్నారు.
చదవండి: పుట్టింటికి వెళ్లిన భార్య.. అత్త చెవి కోసిన అల్లుడు..

మరిన్ని వార్తలు