తల్లి పొత్తిళ్లలో ఓలలాడాల్సిన నెలరోజుల పసికందును..

3 Dec, 2021 04:51 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నీటితొట్టిలో పడవేసి హత్య

తండ్రిని ప్రశ్నిస్తున్న పోలీసులు

గుంటూరు జిల్లాలో ఘటన 

నాదెండ్ల(చిలకలూరిపేట): కన్నతల్లి పొత్తిళ్లలో ఓలలాడాల్సిన నెలరోజుల పసికందును కర్కశంగా హతమార్చిన అమానుష ఘటన గురువారం గుంటూరు జిల్లాలో సంచలనం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నాదెండ్ల మండలం సంకురాత్రిపాడు గ్రామానికి చెందిన పోతురాజు శ్రీనివాసరావు, లక్ష్మి దంపతుల కుమారుడు గోపీకృష్ణ మంగళగిరిలోని ఓ సెల్‌షాపులో పనిచేస్తుంటాడు. వారానికోసారి ఇంటికి వచ్చిపోతుంటాడు. తెలంగాణకు చెందిన ఝాన్సీరాణిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. నవంబర్‌ 1న వీరికి ఓ బాబు జన్మించాడు.

బుధవారం ఎప్పటిలానే అత్తమామలతో కలిసి ఝాన్సీరాణి భోజనం ముగించుకుని నిద్రించింది. అయితే తెల్లవారుజామున లేచి చూసే సరికి.. తన పక్కలో ఉండాల్సిన శిశువు ఇంటి ఎదురుగా ఉన్న నీటి తొట్టెలో విగతజీవిగా కనిపించడంతో ఆమె షాక్‌కు గురైంది. నరసరావుపేట డీఎస్పీ విజయభాస్కరరావు, రూరల్‌ సీఐ కె.సుబ్బారావు, నాదెండ్ల ఎస్‌ఐ కె.సతీష్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. భర్త గోపీకృష్ణ గ్రామానికి చేరుకున్నాడు. శిశువు తండ్రి గోపీకృష్ణను డీఎస్పీ విజయభాస్కరరావు ప్రశ్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

>
మరిన్ని వార్తలు