బ్యాంక్‌ ఉద్యోగి చేతివాటం.. రూ.కోటికి పైగా బ్యాంకు సొమ్ము మాయం

14 Dec, 2021 07:35 IST|Sakshi
ఫైల్‌ ఫొటో

కారంపూడిలో ఆలస్యంగా వెలుగులోకి..

కారంపూడి(మాచర్ల): కారంపూడి ఎస్‌బీఐ బ్రాంచ్‌ ఉద్యోగి ఒకరు సుమారు కోటి రూపాయలు బ్యాంకు సొమ్ము స్వాహా చేసిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. బ్యాంకులో గోల్డ్‌ లోన్‌  అధికారిగా పనిచేస్తున్న సేవ్యానాయక్‌ ఈ అక్రమాలకు పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. గత నాలుగో తేదీ ఒక ఫేక్‌ అకౌంట్‌ ద్వారా నగదు స్వాహా విషయాన్ని గుర్తించిన బ్యాంక్‌ చీఫ్‌ మేనేజర్‌ అప్రమత్తమై పై అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఆర్‌బీఐ టీం, రీజినల్‌ ఆఫీస్‌ అధికారులు రంగంలోకి దిగి శోధించడంతో నగదు స్వాహా పర్వం వెలుగు చూసింది. గత మూడు నెలలుగా బ్యాంకు ఏటీఎంలలో పెట్టడానికి బ్యాంకు నుంచి తీసుకెళ్లిన నగదులో కొంత స్వాహా చేస్తూ మిగతాది ఏటీఎం మిషన్లలో పెడుతూ సేవ్యానాయక్‌ నగదు స్వాహాకు పాల్పడ్డాడు.

చదవండి: భక్తుడిలా రెక్కీ .. రాత్రికి చోరీ!

ఇలా మూడు నెలల కాలంలో సుమారు రూ.కోటికి పైగా దారి మళ్లించాడు. క్రికెట్‌ బెట్టింగులకు బానిసగా మారిన సేవ్యానాయక్‌ బ్యాంకు సొమ్ముతో క్రికెట్‌ బెట్టింగులు ఆడాడంటున్నారు. అయితే ఇతని స్వాహా పర్వాన్ని అధికారులు గత నాలుగో తేదీనే గుర్తించి, ఖాతాలన్నింటినీ జల్లెడ పట్టి ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా చర్యలు తీసుకున్నారు. సేవ్యానాయక్‌ను సస్పెండ్‌ చేశారు. అయితే ఈ ఘటనపై వివరణ ఇవ్వడానికి బ్యాంకు అధికారులు సంసిద్ధత వ్యక్తం చేయలేదు.

మరిన్ని వార్తలు