మాస్కు గొడవ ప్రాణాలమీదకు తెచ్చింది!

29 Jul, 2020 14:09 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: కరోనా విజృంభణతో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడం తప్పనిసరైంది. అయితే, కరీంనగర్‌లో ఓ యువకుడికి మరో వ్యక్తి ఇదే విషయం చెప్పడం అతని ప్రాణాల మీదకు వచ్చింది. మాస్కు పెట్టుకోవాలని సూచించినందుకు హఫీజ్‌ అనే యువకుడు రాకేష్‌ అనే వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన రాకేష్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కరీంనగర్ రూరల్ మండలం తీగలగుట్టపల్లిలో బుధవారం ఈ ఘటన జరిగింది. హెయిర్‌ కటింగ్ కోసం సెలూన్ షాప్ వద్దకు వచ్చిన అజీజ్‌ను అదే గ్రామానికి చెందిన రాకేష్ మాస్క్ పెట్టుకొమ్మని కోరాడు. అందుకు నిరాకరించిన అజీజ్ రాకేష్‌తో గొడవకు దిగాడు. అంతటితో ఆగకుండా కత్తితో అతనిపై దాడికి తెగబడ్డాడు. పక్కటెముకల వద్ద, వీపులో రెండు కత్తిపోట్లు దించాడు. గాయపడ్డ రాకేష్‌ను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించి, నిందితున్ని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అజీజ్‌ గంజాయి మత్తులో ఉండి దాడి చేసినట్టుగా స్థానికులు ఆరోపిస్తున్నారు.
(ఒంటరై ‘పోయాడు’)

మరిన్ని వార్తలు