Facebook Live: పోనీయ్‌.. 300 కి.మీ.లు దాటాలి

18 Oct, 2022 04:29 IST|Sakshi

230 కి.మీ.లు దాటి అత్యంత వేగంగా దూసుకెళ్లిన కారు

ట్రక్కును ఢీకొని కారులోని నలుగురూ దుర్మరణం

లక్నో: బీఎండబ్ల్యూ కారు.. మెరుపు వేగం.. నిర్లక్ష్యపు డ్రైవింగ్‌.. ఫేస్‌బుక్‌ లైవ్‌లో అత్యుత్సాహం.. ఇవన్నీ కలిసి నలుగురి ప్రాణాలను అనంత వాయువుల్లో కలిపేశాయి. 230 కిలోమీటర్ల వేగంతో కారును నడుపుతూ నలుగురు యువకులు ప్రాణాలు బలిచేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై శుక్రవారం సుల్తాన్‌పూర్‌ వద్ద జరిగింది. ఈ ప్రమాదం తాలూకు వీడియో సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమవడంతో వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఆనంద్‌ ప్రకాశ్‌(35), అఖిలేశ్‌ సింగ్‌(35), దీపక్‌ కుమార్‌(37), మరో వ్యక్తి బీఎండబ్ల్యూ కారులో ఎక్స్‌ప్రెస్‌ హైవేపై అత్యంత వేగంతో దూసుకెళ్తున్నారు.

దీంతో అందులోని వ్యక్తి.. ‘ స్పీడ్‌ మరింత పెంచు. స్పీడ్‌ 300 కి.మీ.లు దాటాలి. మనం ఫేస్‌బుక్‌ లైవ్‌లో ఉన్నాం’ అని డ్రైవింగ్‌ చేస్తున్న వ్యక్తితో అన్నాడు. అప్పటికే ఆ వేగంతో భయపడిన కారులోని వ్యక్తి.. ‘మనం నలుగురం చస్తాం. నెమ్మదిగా పోనీయ్‌’ అని అరిచాడు. దీంతో డ్రైవర్‌.. భయపడే వ్యక్తిని వారిస్తూ ‘ అరవకు. నేను అంతటి వేగంతో నడిపి చూపిస్తా’ అని కోప్పడ్డాడు. ఈ వాగ్వాదం నడుమే కారు 230 కి.మీ.ల వేగంలో ప్రయాణిస్తూ ఎదురుగా వస్తున్న ట్రక్‌ను ఢీకొట్టింది. కారు టాప్, ముందుభాగం పగిలిపోయి కారులోని నలుగురూ ఛిద్రమై దూరంగా పడిపోయాడు. అక్కడిక్కడే మరణించారు.

మరిన్ని వార్తలు