విశాఖ: తవ్వే కొద్దీ ‘సృష్టి’ అక్రమాలు

28 Jul, 2020 13:08 IST|Sakshi

విశాఖపట్నం: పసి పిల్లల అక్రమ రవాణా కేసులో సృష్టి ఆస్పత్రి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈకేసులో విశాఖ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తుండటంతో ఆస్పత్రి నిర్వాకాలు బయటపడ్తున్నాయి. ఒక్క విశాఖ బ్రాంచ్ లోనే గడిచిన ఏడాదిన్నర కాలంలో 56 శిశు జననాలు సంభవించాయి. శిశు జననాలన్నీ కుడా అక్రమ రవాణాగానే పోలీసులు భావిస్తున్నారు. తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించడం ద్వారా జీవీఎంసీని అక్రమార్కులు తప్పుదోవ పట్టించారు. చిన్నారుల అక్రమ రవాణాలో యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఎండి డాక్డర్ నమ్రతదే ప్రధాన పాత్ర పోషించినట్టు పోలీసులు తెలిపారు. 
(చదవండి: సృష్టి ఆస్పత్రి ఎండీ నమ్రతకు రిమాండ్‌)

సినిమా కథ తలపిస్తుంది
విశాఖ రూరల్, విజయనగరం, శ్రీకాకుళం, ఒరిస్సాలోని గ్రామీణ ప్రాంతాలలో ఉచిత మెడికల్ క్యాంపుల పేరిట డాక్టర్ నమ్రత భారీగా నెట్ వర్క్ పెంచుకున్నారు. ఆశా వర్కర్ల ద్వారా ఏజెంట్లని నియమించుకుని ఇంట్లో సమస్యలున్న గర్బిణీలకి వల వేశారు. అక్రమాలు బయటపడకుండా  గర్బిణీలకి తన ఆసుపత్రులలో ఉచిత డెలివరీ చేయించేవారు. డెలివరీ తర్వాత చిన్నారిని తీసుకుని తల్లులకి రూ. లక్ష నుంచి రెండు లక్షలు వరకు చెల్లించేవారని పోలీసులు గుర్తించారు.

సాయం చేస్తున్నట్లుగా నటిస్తూ డాక్టర్ నమ్రత చిన్నారుల అక్రమ రవాణా దందాను కొనసాగించారని పోలీసులు వెల్లడించారు. ఏడాదికి ఐదు ఆస్పత్రి బ్రాంచ్‌ల ద్వారా 200 పైనే చిన్నారుల అక్రమ రవాణాకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. డాక్టర్ నమ్రతని విచారిస్తే భారీగా అక్రమాలు బయటకి వస్తాయని పోలీసులు చెప్తున్నారు. కాగా, ఆమెను కస్టడీకి అప్పగించాలని కోరుతూ పోలీసులు నేడు కోర్టులో పిటీషన్ దాఖలు చేయనున్నారు. సృష్టి ఆస్పత్రికి గల హైదరాబాద్‌లోని రెండు బ్రాంచ్‌లు, విజయవాడ, భువనేశ్వర్, కోల్‌కత బ్రాంచ్‌లలో విశాఖ పోలీసులు తనిఖీలు చేయనున్నారు.
(ఆస్పత్రి మాటున అరాచకం)

మరిన్ని వార్తలు