వైరల్‌: నలుగురు టూరిస్టులు కత్తులతో హల్‌చల్‌

15 Jul, 2021 17:31 IST|Sakshi

మనాలి:  నలుగురు టూరిస్టులు నడిరోడ్డుపై కత్తులతో హల్‌చల్‌ చేశారు. రోడ్డు మీద ఉన్న వాళ్లపై దాడి చేయడానికి యత్నించారు. ఈ ఘటన కులు జిల్లాలోని మనాలిలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఓ నెటిజన్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేయగా.. సోషల్‌ మీడియాలో  ప్రస్తుతం వైరల్‌గా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు ఓ కారులో మనాలి బస్‌స్టాండ్‌ నుంచి రంగ్రీ ప్రాంతంలో ప్రయాణిస్తూ.. మరో వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేశారు. అంతటితో ఆగకుండా తమ కారును నడిరోడ్డు మీద నిలిపి ట్రాఫిక్‌ జామ్‌కు పాల్పడ్డారు.

ఇతర వాహనాలకు చెందినవారు కారును రోడ్డు మీద నుంచి వెంటనే తొలగించమనడంతో తమ వద్ద ఉన్న కత్తులతో వారిని బెదిరిస్తూ దాడికి యత్నించినట్లు పోలీసులు తెలిపారు. వారి దాడిలో ఒకరికి గాయాలు అయ్యాయని పేర్కొన్నారు. ఈ ఘటనపై స్పందించిన కులు జిల్లా ఎస్పీ గురుదేవ్‌ చంద్‌శర్మా మాట్లాడుతూ.. పంజాబ్‌లోని సంగ్రూర్ స్థానికులైన రవీందర్, దల్బీర్ సింగ్, అమన్‌దీప్ సింగ్, జస్రాజ్‌ను అదులోకి తీసుకొని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని ఆయన వెల్లడించారు. 

మరిన్ని వార్తలు