జైలుకెళ్లినా బుద్ధి మారలే.. సహజీవనం చేయాలని కానిస్టేబుల్‌ ఒత్తిడి

17 Nov, 2022 11:48 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి:  ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడిన  స్పెషల్‌ బ్రాంచ్‌ కానిస్టేబుల్‌ను  అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.  సీఐ మహేందర్‌రెడ్డి  తెలిపిన వివరాల ప్రకారం.. సైదాబాద్‌కు చెందిన పి.వెంకటేశ్వర్లు  గతంలో మాదన్నపేట పీఎస్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తించాడు. వీరి ఇంటి సమీపంలో నివాసముండే బాధిత మహిళ (34) కుటుంబం.. ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లా ఉండేవారు. వెంకటేశ్వర్లు గతంలో మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించగా ఆమె తిరస్కరించింది. అయినా వినకుండా  మానసికంగా, శారీరకంగా వేధించసాగాడు. 

దీంతో విసిగిపోయిన బాధితురాలు  25 జనవరి, 2021 రోజున సైదాబాద్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. ఈ సమయంలో పోలీసులు అతనికి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించారు. అయినా వెంకటేశ్వర్లు బుద్ధి మార్చుకోకుండా మహిళను వేధించడంతో పాటు తనతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేశాడు. ఎంతకీ అతనిలో మార్పు రాకపోవడంతో మరోసారి సైదాబాద్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో  2021, మే నెలలో వెంకటేశ్వర్లును అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపారు.  ఈ సమ యంలో సదరు మహిళ ఫోన్‌ నంబర్‌తో పాటు తమ నివాసాన్ని మొదట ఈసీఐఎల్‌కు, అక్కడి నుంచి మీర్‌పేట సీతాహోమ్స్‌కు మార్చింది.

 జైలు నుంచి బయటకు వచ్చిన వెంకటేశ్వర్లు హైదరాబాద్‌ స్పెషల్‌ బ్రాంచ్‌ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరాడు. అనంతరం  మహిళ ఫోన్‌ నంబర్, ఇంటి అడ్రస్‌ తెలుసుకుని భర్త, పిల్లలు లేని సమయంలో ఇంటికి వచ్చి వేధించడం ప్రారంభించాడు. 2022, ఆగస్టు 17న మధ్యాహ్నం ఇంట్లోకి చొరబడి తనతో సహజీవనం చేయకపోతే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించి అత్యాచారం చేసి, వీడియోలు ఫొటోలు తీశాడు. ఈ నెల 14న మళ్లీ వెళ్లి.. గతంలో తనపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేశాడు. పరుష పదజాలంతో దూషిస్తూ  లైంగిక దాడికి యత్నించగా ఆమె గట్టిగా కేకలు వేసింది. దీంతో ఆగ్రహానికి గురైన అతడు  నీ నగ్న చిత్రాలు, వీడియోలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తానని హెచ్చరించి వెళ్లిపోయాడు.   బాధితురాలి నుంచి ఫిర్యాదు అందుకున్న మీర్‌పేట్‌  పోలీసులు వెంకటేశ్వర్లుపై అత్యాచారంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు పెట్టి బుధవారం రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు