రెండేళ్లుగా అత్యాచారం: యువకుడి అరెస్టు

19 Feb, 2021 14:56 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

ముంబై: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రియురాలిపై అత్యాచారానికి పాల్పడిన ఓ వ్యక్తిని తానే పోలీసులు అరెస్టు చేశారు. పెళ్లి పేరుతో 21 ఏళ్ల యువతిపై రెండేళ్లుగా లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దీనిపై బాధిత యువతి గత వారం తానే పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంలో పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం.. తానేలోని గౌతమ్‌ నగర్‌కు చెందిన 21 ఏళ్ల యువతికి ఖాన్‌ అనే వ్యక్తితో 2018లో పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అతడు సదరు యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. ఈ సాకుతో ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు.

ఇలా పెళ్లి పేరుతో 2018 నుంచి 2020 వరకు సదరు యువతి ఇష్టానికి వ్యతిరేకంగా ఖాన్‌ అఘాయిత్యానికి పాల్పడుతూ వచ్చాడు. ఈ క్రమంలో బాధిత యువతి గతేడాది అక్టోబర్‌ నుంచి ఖాన్‌ను పెళ్లి చేసుకోవాలని కోరడంతో అతడు మాట్లాడటం, ఫోన్‌ చేయడం తగ్గించాడు. దీంతో బాధితురాలు తానే పోలీసులను ఆశ్రయించింది. జరిగిన విషయం చెప్పి ఖాన్‌పై ఎఫ్‌ఐఆర్‌ ఫైల్‌ చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో ఖాన్‌పై ఐపీసీ సెక్షన్‌ 376తో పలు కేసులు‌ నమోదు చేసి అతడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు