బస్సులో గుండెపోటు.. ప్రాణం పోయేలా ఉందన్నా రోడ్డుపై పడేసి పోయారు!

3 Oct, 2023 10:07 IST|Sakshi

కళ్లెదుటే మనిషి ప్రాణం పోతున్నా.. పట్టించుకోని రోజులివి. అలాంటి హేయనీయమైన ఘటనే తమిళనాడులో చోటు చేసుకుంది. బస్సు ప్రయాణంలో ఓ వ్యక్తికి గుండెపోటు రాగా.. డ్రైవర్‌, కండక్టర్‌ ఏమాత్రం దయ లేకుండా వ్యవహరించారు. నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిపోవడంతో అతని ప్రాణం పోయింది!

విరుదునగర్‌ జిల్లా శ్రీవిల్లిపుత్తూర్‌కి చెందిన జ్యోతిభాస్కర్‌ (50).. శంకరన్‌కోవిల్‌లోని ఓ హోటల్‌లో పనిచేస్తున్నాడు. హోటల్‌కు వెళ్లేందుకు సోమవారం ఉదయం ఓ ప్రైవేటు బస్సు ఎక్కాడు. రాజపాళెయం వద్ద జ్యోతిభాస్కర్‌కు గుండెనొప్పి రావడంతో తోటి ప్రయాణికులు కండక్టర్‌, డ్రైవర్‌కు చెప్పారు. అయితే వాళ్లు ఆయన్ని ఆస్పత్రికి తీసుకెళ్లలేదు. శంకరన్‌కోవిల్‌ రోడ్డు మీదకు దించి మానవత్వం లేకుండా వెళ్లిపోయారు.

ఉదయాన్నే అక్కడే ఉన్న టీ దుకాణం తెరవడానికి వచ్చిన వ్యక్తి పడిపోయి ఉన్న జ్యోతిభాస్కర్‌ను చూసి పైకి లేపడానికి యత్నించాడు. చలనం లేకపోవడంతో అంబులెన్స్‌ ద్వారా రాజపాళెయం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. 

మరిన్ని వార్తలు