విషాదం:కరెంట్ షాక్ తో ఇద్దరు యువకులు మృతి..

14 Aug, 2021 07:39 IST|Sakshi

ఆ తొమ్మిది నెలల పాపకు నాన్న మరి లేడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులను ఆదుకోవడానికి ఆ కుమారుడు ఇక రాడు. పక్షుల వేట కోసం అడవికి వెళ్లిన యువకుల బతుకులు అక్క డే తెల్లారిపోయాయి. అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన తీగలే వారి పాలిట మృత్యు పాశాలయ్యాయి. కొత్తూరు మండలంలో జరిగిన ఈ ఘటన గిరిజన గూడల్లో విషాదం నింపింది.    

ఎల్‌.ఎన్‌.పేట/కొత్తూరు: కొత్తూరు మండలం రాయ ల పంచాయతీ కొత్తపొనుటూరు సమీపంలో గురువారం రాత్రి సవర ఆకాష్‌(17), బుయా బిలియా (22) అనే ఇద్దరు యువకులు విద్యుత్‌ తీగలు తగిలి మృతి చెందారు. శుక్రవారం ఉదయం వీరి మృతదేహాలు కుటుంబ సభ్యులకు దొరికాయి. ఇందుకు సంబంధించి కొత్తూరు పోలీసులు, మృతుల కుటుంబ సభ్యులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి.. కొత్తూరు మండలం కొత్తగూడకు చెందిన సవర ఆకాష్‌(17), తన బంధువు ఒడిశాలోని గరబ గ్రా మానికి చెందిన బుయా బిలియా అలియాస్‌ విలియం(22), నాయుడుగూడకు చెందిన సవర సుశాంత్‌లతో కలిసి గురువారం సాయంత్రం దాటాక తల కు టార్చిలైట్లు కట్టుకుని సమీపంలోని కొండల్లోకి  పక్షుల వేట కోసం వెళ్లారు.

చీకటి పడ్డాక గూటికి చేరే పిట్టలను వేటాడడం ఇక్కడి వారికి పరిపాటి. అయి తే వేట సరిగా సాగకపోవడంతో అంతా ఇంటిదారి పట్టారు. సుశాంత్‌ మరో దారిలో వారి గ్రామానికి చేరుకున్నారు. ఆకాష్, బిలియా మాత్రం ఇంటికి రాలేదు. రాత్రి ఎంత సమయమవుతున్నా వారు ఇంటికి చేరకపోవడంతో కుటుంబ సభ్యులు సుశాంత్‌ను అడిగారు. తను మరో దారి గుండా వచ్చేశానని చె ప్పడంతో బంధువులంతా తప్పిపోయిన ఇద్దరి కో సం అడవిలో వెతకడం ప్రారంభించారు.

శుక్రవారం ఉదయం ఆకాష్‌ తండ్రి ఎలియోకు కొత్తపొనుటూరు కొండల సమీపంలోని పంట పొలాల్లో ఈ ఇద్దరు యువకుల మృతదేహాలను చూశారు. వారిపైనుంచి జింక్‌ వైర్లు ఉండటంతో అవి కాలికి తగిలి విద్యుత్‌ షాక్‌ కొట్టి యువకులు చనిపోయి ఉంటారని భావించారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు మృత దేహాలను పరిశీలించారు. ఈ జింక్‌ వైర్లు కేవలం అడవి పందులను చంపడానికి పెడతారు. దీంతో వాటిని అక్కడ పెట్టారని భావిస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

మిన్నంటిన రోదనలు.. 
మృతుల్లో ఒకరైన బిలియా ఒడిశా వాసి. ఆయనకు భార్య, తొమ్మిది నెలల పసిపాప ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భర్త చనిపోయాడనే విషయం ఆమెకు ఎలా చెప్పాలో తెలీక స్థానికులు కంటనీరు పెట్టారు. అలాగే ఆకాష్‌ ఇంటర్‌ వరకు చదువుకున్నాడు. పై చదువులు చదువుకుని ఉద్యోగం చేసి తమను ఆదుకుంటాడని అనుకుంటే ఇలా అన్యాయం చేసి వెళ్లిపోయాడని కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. ఆకాష్‌ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాలను కొత్తూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని పాలకొండ డీఎస్పీ శ్రావణి, కొత్తూరు సీఐ చంద్రమౌళి పరిశీలించారు.    

మరిన్ని వార్తలు