ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను చంపిన భార్య

24 Oct, 2021 07:34 IST|Sakshi
నిందితులు రూప, తంగమణి

సాక్షి, కెలమంగలం (కర్ణాటక): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియునితో కలిసి హతమార్చిన భార్యను డెంకణీకోట పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితులు రూప, తంగమణి.  వివరాలు.. డెంకణీకోట సమీపంలోని ఉణిసెట్టి గ్రామానికి చెందిన అయ్యప్ప (37) టెంపో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతని భార్య రూప (25). వీరికి ముగ్గురు పిల్లలున్నారు. అయ్యప్ప బంధువు తంగమణి (20) జవుళగిరి సమీపంలోని మంచుగిరి గ్రామంలో ఉండగా, ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.

మూడు నెలల క్రితం ఇద్దరూ ఇళ్లలో నుంచి వెళ్లిపోయారు. 10 రోజుల క్రితం బంధువులు వారిని పట్టుకుని ఎవరి ఇళ్లకు వారి పంపారు. మర్యాద పోయిందని అయ్యప్ప రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేసినా బయటపడ్డాడు. ఇదే అదనుగా రూప, తంగమణితో కలిసి భర్తను చంపాలనుకుంది. శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న అయ్యప్పను ఇద్దరూ కలిసి గొంతు పిసికి చంపారు. ఉదయాన్నే ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని రూప విలపించసాగింది. డెంకణీకోట పోలీసులు అనుమానంతో రూప, తంగమణిలను అదుపులోకి తీసుకొని విచారణ జరుపగా తామే హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. ఇరువురిని అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు.  తండ్రి హత్య, తల్లి జైలుకు పోవడంతో పిల్లలు దిక్కులేనివారయ్యారు.    

మరిన్ని వార్తలు